సూత్రధారి రాజశేఖరే! | CIT submitted preliminary investigation report to TSPSC | Sakshi
Sakshi News home page

సూత్రధారి రాజశేఖరే!

Mar 18 2023 12:57 AM | Updated on Mar 18 2023 12:57 AM

CIT submitted preliminary investigation report to TSPSC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పబ్లిక్‌ సర్వి స్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) పరీక్ష పేపర్ల లీకేజీ స్కామ్‌లో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో కమిషన్‌ కార్యదర్శి వద్ద పీఏగా పని చేస్తున్న ప్రవీణ్‌కుమార్‌ సూత్రధారి అని ఇప్పటివరకు భావించగా.. అతడిని పథకం ప్రకారం ప్రేరేపించినది రాజశేఖరేనని అధికారులు గుర్తించినట్టు తెలిసింది.

రాజశేఖర్‌కు రాజకీయ సంబంధాలు సైతం ఉండటంతో.. ఆ కోణంలోనూ దర్యాప్తు చేపట్టినట్టు సమాచారం. ఇక లీకేజీ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) శుక్రవారం టీఎస్‌పీఎస్సీకి ప్రాథమిక నివేదికను అందించింది. మొత్తం ఐదు పరీక్షల పేపర్లు లీకైనట్టుగా గుర్తించినట్టు తెలిసింది. 

ముందస్తు ప్లాన్‌తోనే.. 
రాజశేఖర్‌ టీఎస్‌టీఎస్‌ నుంచి టీఎస్‌పీఎస్సీకి డిప్యుటేషన్‌పై రావడంలోనూ కుట్ర ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. పేపర్లపై కన్నేసిన రాజశేఖర్‌.. లీకేజీ కోసం ముందుగా ప్లాన్‌ చేసుకునే వచ్చాడని.. కార్యదర్శికి ప్రవీణ్‌ పీఏగా మారిన తర్వాత ప్లాన్‌ అమలు చేశాడని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రవీణ్‌తో సన్నిహితంగా ఉన్నాడని అంటున్నారు.

సిస్టమ్‌ అడ్మిన్‌ అయిన రాజశేఖరే కస్టోడియన్‌ శంకరలక్ష్మి కంప్యూటర్‌ను హ్యాక్‌ చేసి, పేపర్లు తస్కరించాడని.. వాటిని ప్రవీణ్‌కు ఇచ్చి రేణుకతో అమ్మించాడని అనుమానిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాన్నీ రాజశేఖర్‌ ఇలానే చేజిక్కించుకుని ప్రవీణ్‌కు ఇచ్చి ఉంటాడని.. దాని ఆ«ధారంగా పరీక్ష రాయడంతోనే ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చి ఉంటాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

రాజశేఖర్‌ పాత్ర కీలకం
పేపర్ల లీకేజీపై సిట్‌ అధికారి, ఏసీపీ వెంకటేశ్వర్లు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో రాజకీయ నాయకుడైన రాజశేఖర్‌ పాత్ర కీలకంగా మారనుందని.. అతడే ప్రవీణ్‌తో కలిసి ఈ లీకేజ్‌ చేసినట్టుగా ఆధారాలు లభించాయని తెలిపారు. రాజశేఖర్‌ కొందరు రాజకీయ నాయకులతో కలిసి దిగిన ఫొటోలు లభ్యమయ్యాయని.. ఈ నేపథ్యంలో ఆయా రాజకీయ నేతల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

ఇక కస్టోడియన్‌ శంకరలక్ష్మి కంప్యూటర్‌ నుంచి మొత్తం ఐదు పేపర్లు తస్కరణకు గురయ్యాయని.. వాటిలో ఏయే పేపర్లు లీక్‌ అయ్యాయనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పేపర్‌ వ్యవహారంతోపాటు, ఆ పరీక్ష రాసిన ప్రవీణ్‌కు అన్ని మార్కులు రావడంపైనా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రవీణ్‌ ఈ పరీక్ష పేపర్లను ఎవరెవరికి ఇచ్చాడన్నది ఆరా తీస్తున్నామ ని చెప్పారు. ప్రవీణ్, రాజశేఖర్‌ సహా నిందితుల ఫోన్లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించామని, ఆ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని తెలిపారు. 

పోలీసు కస్టడీకి నిందితులు 
ఈ కేసులో అరెస్టయిన తొమ్మిది మంది నిందితులను పోలీసు కస్ట డీకి ఇస్తూ నాంపల్లి కోర్టు శు క్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం నుంచి 23వ తేదీ వ రకు పోలీసులు వారి ని ప్రశ్నించి.. ఈ వ్యవహారంలో అన్ని వివరాలను ఆరా తీయనున్నా రు. ఇదే సమయంలో ప్రవీణ్, రాజశేఖర్, శంకరలక్ష్యలను కలిపి విచారించి.. వాస్తవాలను వెలికితీయాలని అధికారులు నిర్ణయించారు.  

ఐడీ, పాస్‌వర్డ్‌ దొరికిందెలా? 
కస్టోడియన్‌ శంకరలక్ష్మి నోట్‌బుక్‌ నుంచి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్స్‌ తస్కరించామని.. వాటి ఆధారంగానే ఆమె కంప్యూటర్‌ను యాక్సెస్‌ చేసి పరీక్ష పేపర్లు కాపీ చేసుకున్నామని అరెస్టు సమయంలో ప్రవీణ్, రాజశేఖర్‌ చెప్పారు. కానీ అధికారులు శంకరలక్ష్యని ప్రశ్నించగా.. తాను యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్స్‌ను ఎక్కడా రాసుకోలేదని చెప్పినట్టు తెలిసింది. దీనితో ఆమె నుంచి అధికారికంగా స్టేట్‌మెంట్‌ తీసుకోవడానికి సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement