ప్రైవేటు జేబుల్లోకి రూ. 500 కోట్ల రాయితీ! | The center is awarding the contract of electric buses to a private company | Sakshi
Sakshi News home page

ప్రైవేటు జేబుల్లోకి రూ. 500 కోట్ల రాయితీ!

May 30 2025 1:40 AM | Updated on May 30 2025 1:40 AM

The center is awarding the contract of electric buses to a private company

ఎలక్ట్రిక్‌ బస్సుల సరఫరా, నిర్వహణ కాంట్రాక్టు ప్రైవేటు సంస్థకు అప్పజెబుతున్న కేంద్రం 

2 వేల బస్సులకు సంబంధించిన రూ.500 కోట్ల సబ్సిడీ ఆ సంస్థకే ఇస్తున్న వైనం 

తామే బస్సులు కొంటాం. తమకే ఆ రాయితీ ఇవ్వాలంటున్న రాష్ట్ర ప్రభుత్వం 

ససేమిరా అంటున్న కేంద్ర ప్రభుత్వం..రాయితీ నష్టం.. ఆర్టీసీలో డ్రైవర్‌ పోస్టులకూ కోత 

గతంలో ‘ఫేమ్‌’పథకంలో కూడా సబ్సిడీని ప్రైవేటు సంస్థలకే కట్టబెట్టిన మోదీ సర్కారు 

సాక్షి, హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా డీజిల్‌ బస్సులను తగ్గించటం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించాలన్న సంకల్పంతో రాష్ట్రాలకు ఎలక్ట్రిక్‌ బస్సులను కేంద్ర ప్రభుత్వం రాయితీ ధరలకు సరఫరా చేస్తోంది. రాయితీ ధరలకు సరఫరా చేస్తేనే రాష్ట్రాలు ఎలక్ట్రిక్‌ బస్సులను కొంటాయనే ఆలోచనతో కేంద్రం పీఎం ఈ–డ్రైవ్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ రాయితీ ప్రైవేటు సంస్థల జేబుల్లోకి చేరుతుండటంతో, రాష్ట్ర ప్రభుత్వాల అదీనంలోని ఆర్టీసీలకు ప్రయోజనం చేకూరకుండా పోతోంది. 

ప్రైవేటు కాంట్రాక్టు సంస్థకే బస్సులు  
పీఎం ఎలక్ట్రిక్‌ డ్రైవ్‌ రివల్యూషన్‌ ఇన్‌ వెహికిల్‌ ఎన్‌హెన్స్‌మెంట్‌ (పీఎం ఈ డ్రైవ్‌) పథకం కింద తెలంగాణ ఆర్టీసీకి కేంద్రం తాజాగా 2 వేల ఎలక్ట్రిక్‌ బస్సులను మంజూరు చేసింది. అయితే ఈ బస్సులను టెండర్‌ ద్వారా ప్రైవేటు సంస్థకు కేటాయిస్తోంది. దీంతో ఆ సంస్థే బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన (గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్టు) నిర్వహించాల్సి ఉంది. ఇందుకు గాను టెండర్‌లో కోట్‌ చేసిన ధర ప్రకారం ఆర్టీసీ ప్రతి కి.మీ.కు నిర్ధారిత మొత్తం(రూ.50–రూ.60 మధ్య) చెల్లించాల్సి ఉంటుంది. 

కాగా కాంట్రాక్టు సంస్థకు కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్ల మొత్తం రాయితీ కల్పించింది. అంటే ఆయా బస్సుల ఖరీదులో ఆ మేరకు సంస్థకు ఆదా అవుతుందన్న మాట. ఈ నేపథ్యంలో బస్సులు తామే కొంటామని, అదే రాయితీని ఆర్టీసీలకు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్రం ససేమిరా అంటోంది. గతంలో మోదీ ప్రభుత్వం అమలు చేసిన ‘ఫేమ్‌’(ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఆఫ్‌ హైబ్రిడ్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌) పథకంలో కూడా రాయితీని ప్రైవేటు సంస్థలకే కట్టబెట్టడం గమనార్హం. 

ఒక్కో బస్సుకు సగటున రూ.25 లక్షల సబ్సిడీ 
ఆర్టీసీకి సరఫరా చేసే బస్సుల్లో వెయ్యి వరకు 12 మీటర్ల పొడవు ఉండే బస్సులు, మరో వెయ్యి 9 మీటర్ల బస్సులు ఉన్నాయి. వీటిల్లో 100 మాత్రమే ఏసీ బస్సులు కాగా, మిగతావి నాన్‌ ఏసీ బస్సులు. ఇవన్నీ హైదరాబాద్‌ నగరంలో తిరుగుతాయి. ఒక్కో బస్సుకు సగటున రూ.25 లక్షల సబ్సిడీని కేంద్రం ప్రకటించింది. 

ఒక్కో ఎలక్ట్రిక్‌ బస్సు కొనాలంటే రూ.కోటిన్నర వరకు ఖర్చవుతోంది. అంత మొత్తం భరించటం ఆర్టీసీ, రాష్ట్ర ప్రభుత్వాలకు భారంగా ఉంటోంది. దీంతో రాయితీ మొత్తాన్ని నేరుగా ఆర్టీసీకి ప్రకటిస్తే సొంతంగా కొనే వెసులుబాటు ఉంటుందని, అప్పుడు బస్సులు కూడా ఆర్టీసీ సొంతమవుతాయన్నది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన.  

అందరూ ప్రైవేటు డ్రైవర్లే..
అద్దె ప్రాతిపదికన ఆర్టీసీలో బస్సులు నిర్వహించే కాంట్రాక్టు సంస్థ, వాటికి డ్రైవర్లను కూడా తానే ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు మంజూరు చేసిన బస్సులు వచ్చే జనవరి నుంచి రెండేళ్ల కాలంలో విడతల వారీగా ఆర్టీసీకి సమకూరుతాయి. ఆ బస్సులు రావటంతోనే, అంతే సంఖ్యలో నగరంలోని డీజిల్‌ బస్సులను ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. 2 వేల బస్సులకు దాదాపు 5 వేల మంది డ్రైవర్లు ఉంటారు. 

భవిష్యత్తులో ఈ అద్దె ఎలక్ట్రిక్‌ బస్సులన్నిటికీ ప్రైవేటు డ్రైవర్లే ఉండనున్నందున అంత మేర ఆర్టీసీకి సొంత డ్రైవర్ల అవసరం ఉండదు. ఫలితంగా అన్ని డ్రైవర్‌ పోస్టులు కోల్పోవాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఆ బస్సులకు ఆర్టీసీ డ్రైవర్లు ఉండేలా నిబంధన మార్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కూడా కేంద్రం తోసిపుచ్చినట్టు తెలిసింది.  

ఆ రాయితీతో వెయ్యి డీజిల్‌ బస్సుల రిట్రోఫిట్‌కు చాన్స్‌ 
ప్రస్తుతం వినియోగంలో ఉన్న డీజిల్‌ బస్సులను ఎలక్ట్రిక్‌ బస్సులుగా రిట్రోఫిట్‌ చేసే పరిజ్ఞానం అందుబాటులో ఉంది. ఆ ప్రయోగాన్ని ఆర్టీసీ విజయవంతంగా అమలు చేస్తోంది. ఒక్కో పాత బస్సును కన్వర్ట్‌ చేసేందుకు రూ.50 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇప్పుడు కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులకు కేంద్రం ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని గనుక రాష్ట్రానికి కేటాయిస్తే ఏకంగా 1,000 బస్సులను కన్వర్ట్‌ చేసే వెసులుబాటు ఉంటుంది. ఈ మేరకు ఆర్టీసీ సమరి్పంచిన ఈ ప్రతిపాదన కూడా కేంద్రం వద్ద పెండింగులోనే ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement