హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్లకు తెలియకుండా 22 వేల అక్రమ భూ బదలాయింపులు జరగాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. సాఫ్ట్వేర్ మార్చి అధికారులకు తెలియకుండా భూ దందా జరిగిందన్నారు. అక్రమ భూ బదలాయింపులపై ఉన్నతస్థాయి విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఏసీబీ కేసుల్లో రెండు కళ్ల ధోరణి పాటిస్తున్నారన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ముఖ్యమంత్రికి కోపం వస్తే ఏసీబీ కేసు పెడుతున్నారంటూ మండిపడ్డారు.
ఒకవైపు రైతులు ఎల్ నినో, వర్షాభావ ప్రమాదంలో... కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయకుండా రైతుల జీవితాలు ఆగం అవుతుంటే...మరో వైపు భూమి ఉన్న రైతులు పేర్లు, నిషేధిత భూముల జాబితా, సాదాబైనామా వంటి ఇతర సమస్యల గురించి అధికారుల చుట్టూ తిరుగుతుంటే...ఆ భూములన్ని అక్రమంగా ఇతరుల పేర్ల మీదికి భూ బదలాయింపు చేస్తున్నారు.
పొంగులేటి కింద నడుస్తున్న రెవెన్యూ శాఖ, రిజిస్ట్రేషన్ శాఖలోఇప్పటివరకు 22 వేల ఫైల్స్ భూ యజమానులకు తెలియకుండానే, వారి ప్రమేయం లేకుండానే, ఇతరుల పేర్ల మీదికి మార్చారు. ఇందులో నిషేధిత భూములు కూడా ఉన్నాయి.ఓట్లేసింది ప్రజల ధన,మాన,ప్రాణాలు రక్షిస్తారని. కాంగ్రెస్ పాలనలో మాన ప్రాణాలకు రక్షణ లేదు.
ఇపుడు ధనం లేదా ఆస్తి కూడా లేకుండా చేస్తున్నారు. ప్రజలంతా భూ భారతిలో మీ భూమి ఉందా లేదా చూసుకోండి. ఈసీ చెక్ చేసుకోండి. పొంగులేటి కింద ఉన్న రెవెన్యూ శాఖలో,భూమి ఈసీ కోసం చూస్తే ఏమీ కనిపించట్లేదు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. పొంగులేటి, రేవంత్ రెడ్డి కలిసి రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారు.జనవరి 2026 లో జనగామ కుంభకోణం గురించి మాట్లాడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఈ 22 వేల భూ బదలాయింపుల గురించి ఎందుకౌ మాట్లాడడంలేదు.?’ అని ప్రశ్నించారు.


