హైదరాబాద్: తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలా వాడుకుంటోందంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అవినీతి ముఖ్యమంత్రా? లేక బీజేపీ 'కోవర్ట్' మిత్రుడా? అని నిలదీస్తూ ట్వీట్ చేశారు.
‘‘ఒకవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ వేదికగా బహిరంగంగానే రేవంత్ రెడ్డిని "ఛోటే భాయ్" (తమ్ముడు) అని సంబోధిస్తూ, “హమ్సే జుడ్ జావో" (మాతో కలిసిపోండి) అంటూ అప్యాయంగా ఆహ్వానిస్తారు. మరోవైపు, అదే పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఢిల్లీలో కూర్చుని.. "రేవంత్ రెడ్డి అవినీతిపరుడు, తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తన ఏటీఎంలా వాడుకుంటోంది" అంటూ ఒక పొలిటికల్ స్క్రిప్ట్ చదువుతారు!
అసలు ఇది మీ జాతీయ విధానమా? లేక రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్తో కలిసి మీరు ఆడుతున్న కుమ్మక్కు రాజకీయ నాటకమా (మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా)? పరస్పర విరుద్ధంగా పదే పదే మారుతున్న ఈ ప్రకటనలు, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల బీజేపీ జాతీయ నాయకత్వం ప్రదర్శిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను, బీజేపీ- తెలంగాణ కాంగ్రెస్ లోపాయికారీగా ఒకరితో ఒకరు చేతులు కలిపారనే నిజాన్ని స్పష్టంగా బట్టబయలు చేస్తున్నాయి.
ఇది ఒక ప్రమాదకరమైన రాజకీయ వ్యూహానికి అద్దం పడుతోంది. బయట ప్రపంచానికి తాము ప్రతిపక్షం అని చెప్పుకుంటూ, నాటకీయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ.. తెరవెనుక మాత్రం ఆయనను రేపు పొద్దున తమ వైపు తిప్పుకోబోయే ఒక సంభావ్య ఫిరాయింపుదారుడిగా (Turncoat), అస్సాంలో హిమంత బిస్వా శర్మ లేదా పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి తరహా నాయకుడిగా బీజేపీ సిద్ధం చేస్తోంది.
తెలంగాణ సమాజం, ఈ దేశ ప్రజలు బీజేపీని సూటిగా ఒకే ఒక్క స్పష్టమైన సమాధానం కోసం డిమాండ్ చేస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డి మీ దృష్టిలో జైలుకు వెళ్లాల్సిన కాంగ్రెస్ పార్టీ అవినీతి ముఖ్యమంత్రా? లేక మీ పార్టీలో చేరాల్సిందిగా మీరు బహిరంగంగా ఆహ్వానిస్తున్న (హమ్సే జుడ్ జావో) మీ 'కోవర్ట్ మిత్రుడా ' (Covert Friend)? దేశ ప్రజలు ఈ నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు!’’ అని అన్నారు.


