కేంద్రమంత్రి బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారంటీలు, 420 హామీలను ఏ రోజు నుంచి అధికార కాంగ్రెస్ అమలు చేస్తుందో..వాటికి ఎంత ఖర్చవుతుందో చెప్పి అమలు తేదీని ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో అధికారానికి వచ్చి రెండున్నరేళ్లు దాటినా ఇచ్చిన హామీల్లో 10 శాతం కూడా అమలు చేయనందుకు సిగ్గన్పించడం లేదా సీఎం గారూ? డూప్లికేట్ గాంధీ కుటుంబానికి రూ.వెయ్యి కోట్లు పంపాలనే శ్రద్ధే తప్ప మీకు ప్రజా సమస్యలు పట్టవా’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ప్రశ్నించారు.
‘రాష్ట్ర మంత్రివర్గంలో డూప్లికేట్ గాంధీ కుటుంబానికి పంపాల్సిన రూ.వెయ్యి కోట్ల నిధుల సేకరణపైనే చర్చ జరుపుతున్నారా’అని ఎద్దేవా చేశారు. డూప్లికేట్ గాంధీ కుటుంబానికి మూటలు పంపి పదవులు కాపాడుకోవాలనే తాపత్రయమే తప్ప 6 గ్యారంటీల అమలుపై ఎన్నడైనా చర్చించారా అని సోమవారం ఒక ప్రకటనలో నిలదీశారు. ఆరు గ్యారంటీల అమలుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆధ్వర్యంలో ఉద్యమించి హామీలను పూర్తిచేసేలా ప్రభుత్వం మెడలు వంచి తీరుతామని హెచ్చరించారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల అమలు సాధ్యాసాధ్యాలపై కేబినెట్లో ఎందుకు చర్చించడం లేదని నిలదీశారు. ‘మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఇస్తామని చెప్పి రెండున్నరేళ్లు అయ్యింది. ఆ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు? రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెన్ఫిట్స్ చెల్లించకపోవడంతో 61 మంది చనిపోయినా మీలో చలనం లేదా? ఉద్యోగ, ఉపాధ్యాయులకు 5 డీఏలు, పెండింగ్ బకాయిలు అందక ఇబ్బంది పడుతున్నా మీకు పట్టదా? ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలివ్వకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు, వేలాది యాజమాన్యాలు అల్లాడుతున్న సంగతి మర్చిపోయారా’అని ప్రశ్నించారు.


