భూభారతి మాకు ఎన్నికల రెఫరెండమే! | Awareness Program On Bhu Bharati in Nalgonda: Ponguleti Srinivas Reddy | Sakshi
Sakshi News home page
breaking news

భూభారతి మాకు ఎన్నికల రెఫరెండమే!

Jun 10 2025 4:30 AM | Updated on Jun 10 2025 4:30 AM

Awareness Program On Bhu Bharati in Nalgonda: Ponguleti Srinivas Reddy

మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి, చిత్రంలో మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఈ చట్టం దేశానికే రోల్‌ మోడల్‌

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి

సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతాం: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

మిర్యాలగూడ: భూభారతి చట్టం దేశానికే రోల్‌ మోడల్‌ అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆయన మంజూరు పత్రాలు అందజేశారు. భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో భాగంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

రాబోయే ఎన్నికల్లో భూభారతి చట్టం కాంగ్రెస్‌ పార్టీకి రెఫరెండం లాంటిదని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో 22 మండలాల్లో 22 రెవెన్యూ గ్రామాలను పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకొని భూ సమస్యలు పరిష్కరించామని చెప్పారు. రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరిస్తున్న దరఖాస్తులను ఆగస్టు 15 లోపు పరిష్కరిస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో ధరణి ద్వారా వచ్చిన 9.26 లక్షల దరఖాస్తులను కూడా పరిష్కరిస్తామని చెప్పారు. 6 వేల మంది సర్వేయర్లను, 10,956 మంది వీఆర్‌వో, వీఆర్‌ఏలను త్వరలోనే నియమిస్తామని వెల్లడించారు.

వేగంగా నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తకుమార్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను, లిఫ్టులను పూర్తిచేసి తీరుతామని చెప్పారు. సాగర్‌ ఎడమకాల్వ మరమ్మతులకు రూ.67 కోట్లతో ప్రతిపాదనలు వచ్చాయని, వాటిని మంజూరు చేయిస్తామని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు డబ్బు రూ.15,181 కోట్లను 12 లక్షల మంది రైతులకు చెల్లించినట్లు వెల్లడించారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందన్న అక్కసుతోనే బీఆర్‌ఎస్‌ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో రోడ్లను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్, సబ్‌ కలెక్టర్‌ నారాయణ్‌అమిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement