సాక్షి, వరంగల్: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ తిరిగి సొంత గూటికి చేరుకోనున్నారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేసిన రమేశ్.. బీఆర్ఎస్ అధిష్టానం ఆహ్వనం మేరకు త్వరలోనే పలువురు నాయకులు, అనుచరులు, అభిమానులతో కలిసి గులాబీ పార్టీలో చేరనున్నారు. వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల వేళ అరూరి రమేశ్ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరనుండటంతో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
2024, మార్చిలో బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన రమేశ్ అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయంగా ఆశించిన స్థాయి ప్రాధాన్యం లభించకపోవటం, పార్టీలో క్రియాశీలక ప్రాధాన్యం తగ్గిపోవడం ఆయన అసంతృప్తికి కారణమైనట్టు తెలుస్తోంది.


