తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా.. | Anand Mahindra To Lead Telangana Skill University As Chairman: CM Revanth | Sakshi
Sakshi News home page

తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా: సీఎం రేవంత్‌

Aug 5 2024 3:46 PM | Updated on Aug 5 2024 4:16 PM

Anand Mahindra To Lead Telangana Skill University As Chairman: CM Revanth

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే యంగ్ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా పేరును ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.  అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌..  ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 

తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్‌గా వ్యహరించమని టెక్‌ మహీంద్రా గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ ఆనంద్ మహీంద్రాను కోరినట్లు సీఎం తెలిపారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని.. రెండు, మూడు రోజుల్లో తన నిర్ణయం చెబుతానని పేర్కొన్నట్లు తెలిపారు. అయితే మరో రెండు రోజుల్లో ఆనంద్‌ మహీంద్రా..  వర్సిటీ చైర్మన్‌ బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.

 

కాగా రంగారెడ్డి జిల్లా కందుకూరులోని మీర్‌ఖాన్‌పేట్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ (వృత్తి నైపుణ్యాభివృద్ధి) యూనివర్సీటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. రూ.100 కోట్లతో 57 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ వర్సిటీకి ఆగస్టు 1న సీఎం రేవంత్‌ శంకుస్థాపన చేశారు. ఇందులో 17 కోర్సులను అందుబాటులోకి తేనున్నారు.

తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆనంద్‌ మహీంద్ర ఒక ఆదర్శవంతమైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ దేశ యువత ఎవరైనా తమ స్కిల్‌ను ప్రదర్శిస్తే ఆ ఫోటోలు, వీడియోలు తన సోషల్ మీడియాలో పెట్టి వారిని ప్రోత్సహించడంలో ఆయన ముందు వరుసలో ఉంటారని తెలిపారు. అటువంటి వ్యక్తిని తెలంగాణలో ఏర్పాటుకాబోతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఛైర్మనన్‌గా సీఎం ఎంపిక చేయడం మంచి నిర్ణయమని కొనియాడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement