ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోరు.. పోలింగ్ ఘట్టానికి సర్వం సిద్ధం | All Arrangements Ready For Teacher MLC Elections Polling | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోరు.. పోలింగ్ ఘట్టానికి సర్వం సిద్ధం

Mar 12 2023 6:45 PM | Updated on Mar 12 2023 6:55 PM

All Arrangements Ready For Teacher MLC Elections Polling - Sakshi

హైదరాబాద్‌‌‌‌– రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి తరలించారు. ప్రాధాన్యత క్రమంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. హైదరాబాద్‌‌–రంగారెడ్డి–మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఎన్నికల ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారి ప్రియాంక ఆలా పరిశీలించారు.

గ్రేటర్ హైదరాబాద్  మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయం నుంచి పోలింగ్ సామాగ్రిని, బ్యాలెట్ పేపర్స్ పోలింగ్ కేంద్రాలకు తరలించారు.  137 పోలింగ్ కేంద్రాల్లో 29 వేల 720 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 21 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి 12 మంది సెక్టరోల్ అధికారులను, 29 మంది అబ్జర్వర్లను నియమించారు.

ప్రాధాన్యత క్రమంలో బ్యాలెట్ విధానంలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఇచ్చిన పెన్నుతోనే బ్యాలెట్ పేపర్ లో ప్రాధాన్యత క్రమంలో అంకెలు వేయాల్సి ఉంటుంది. పోలింగ్ స్టేషన్లలో పోలీసు బందోబస్తు, ఓటర్లకు మౌలిక సదుపాయాలు, మంచినీరు, టెంట్లు ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.  పోలింగ్ కేంద్రాలను వెబ్ క్యాస్టింగ్ ద్వారా పరిశీలించనున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రియాంక ఆలా తెలిపారు.

పొలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్స్‌లను సరూర్ నగర్ ఇండోర్ స్టేడియానికి తరలించనున్నారు. ఈ నెల 16న కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు.  అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం.. ప్రాధాన్యత క్రమంలో ఓట్లను లెక్కించాల్సి ఉండటంతో ఫలితాల ప్రకటనకు 24 గంటలకు పైగా సమయం పట్టనుంది.

Advertisement
 
Advertisement
Advertisement