
సాక్షి, హైదరాబాద్: రాహుల్గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’యాత్ర ఈనెల 24న తెలంగాణలో ప్రవేశించనుందని, దీనికి అందరూ కలసి రా వాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి, యాత్ర తెలంగాణ పబ్లిసిటీ ఇన్చార్జి రమణి పిలుపునిచ్చారు. దేశంలో కుల, మత తారతమ్యాలతో మనుషుల మధ్య అనైక్యత పెరిగిపోతోందని, తన రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని ఆయన ఆరోపించారు.
‘భారత్ జోడో’యాత్ర విజయవంతం కోసం గాంధీభవన్లో టీపీసీసీ అధికార ప్రతినిధులు, సోషల్ మీడియా విభాగంతో రమణి శుక్రవారం భేటీ అయ్యారు. యాత్ర ముఖ్య ఉద్దేశం, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై టీపీసీసీ నేతలతో ఆయన చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. దేశ సంపదను వ్యాపారవేత్తలకు దోచిపెడుతూ, ప్రజల ఆస్తులను ప్రైవేటు పరం చేస్తోందని విమర్శించారు. నిరుద్యోగం, పేదరికం దేశాన్ని పట్టి పీడిస్తున్నాయని, పెరిగిన నిత్యావసరాల ధరలు పేదల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.