తెలంగాణకు 6,684 కోటా
జూలై 20 వరకు దరఖాస్తులకు అవకాశం.. 65 ఏళ్లు దాటితే డైరెక్ట్ సెలెక్షన్
వివరాలు వెల్లడించిన చైర్మన్ ఖుస్రో పాషా
సాక్షి, హైదరాబాద్: 2027 హజ్ యాత్ర షెడ్యూల్ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని, రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తుల స్వీకరణ సైతం ప్రారంభమైందని తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ అఫ్జల్ బియబానీ ఖుస్రో పాషా మంగళవారం వెల్లడించారు. జూలై 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. తెలంగాణకు 6,684 మంది యాత్రికుల కోటాను కేంద్ర హజ్ కమిటీ కేటాయించిందన్నారు.. 65 ఏళ్లు పైబడిన వారు దరఖాస్తు చేసుకుంటే నేరుగా యాత్రకు ఎంపికవుతారని పేర్కొన్నారు.
15 ఏళ్లు పైబడిన వారే అర్హులని, మిగిలిన వారిని డ్రా పద్ధతిలో ఎంపిక చేస్తామన్నారు. డ్రా జూలై చివరివారం లేదా ఆగస్టు మొదటి వా రంలో ఉంటుందన్నారు.. ఎంపికైన వారు మొదటి విడతగా రూ.1,52,300 చెల్లించాలని సూచించారు. పాస్పోర్ట్ వ్యాలిడిటీ 31 డిసెంబర్ 2027 వరకు ఉండాలన్నారు. 2026 వెయిటింగ్ లిస్టులోని 20 శాతం మందికి ఈసారి అవకాశం దక్కుతుందన్నారు.
2026 హజ్ యాత్ర ఈ నెల 22తో ముగిసిందని, 14 రాష్ట్రాల నుంచి 9,660 మంది వెళ్లగా తెలంగాణ నుంచి 6,684 మంది ఉన్నారని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో యాత్రికుల రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరించిందని, రూ.7 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. 19 ప్రభుత్వ శాఖల సమన్వయంతో యాత్ర విజయవంతమైందని, సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.


