నకిలీ విత్తన ముఠా అరెస్ట్‌  | Fake seed gang arrested | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తన ముఠా అరెస్ట్‌ 

Jun 15 2023 4:51 AM | Updated on Jun 15 2023 4:51 AM

Fake seed gang arrested - Sakshi

నార్కట్‌పల్లి: నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్న ఓ ముఠాను నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.80 కోట్ల విలువైన పది టన్నుల పత్తి విత్తనాలను స్వాదీనం చేసుకున్నారు. బుధవారం నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నల్లగొండ ఎస్పీ అపూర్వరావు వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్‌ పరిధిలోని అల్వాల్‌ హిల్స్‌ ప్రాంతానికి చెందిన గోరంట్ల నాగార్జున, ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా పెద్దకూరపాడు గ్రామానికి చెందిన గడ్డం రవీంద్రబాబు, నంద్యాల జిల్లా గోసపాడు మండలం జిల్లెల గ్రామానికి చెందిన మెరిగె వేణు, అన్నమయ్య జిల్లా మదనపల్లి గ్రామానికి చెందిన నర్సింహ ఓ ముఠాగా ఏర్పడి కొన్నేళ్లుగా నకిలీ పత్తి విత్తనాల వ్యాపారం చేస్తున్నారు.

ఈ ము ఠా సభ్యులు కర్ణాటకలో పత్తి విత్తనాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి గుంటూరు జిల్లా దాచేపల్లి సమీపంలో స్టోరేజీ చేశారు. అక్కడ నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన రైతులకు ఎక్కువ ధరకు అమ్మేందుకు హైదరాబాద్‌ మీదుగా తరలించాలని నిర్ణయించుకున్నారు. కారులో నాగార్జున, రవీంద్రబాబు, వేణు బయలుదేరారు. పక్కా సమాచారంతో బుధవారం తెల్లవారుజామున నార్కట్‌పల్లి ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వద్ద పోలీసులు, టాస్‌్కఫోర్స్, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా వాహనాల తనిఖీ చేపట్టారు.

ఈ క్రమంలో ఓ ఎర్టిగా కారును తనిఖీ చేయగా రెండు బస్తాల విత్తనాలు బయటపడ్డాయి. వాటిని వ్యవసాయ అధికారులు పరిశీలించి నకిలీ విత్తనాలుగా నిర్ధారించారు. దీంతో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి మిగతా విత్తనాలను కూడా స్వా«దీనం చేసుకున్నారు. మరో నిందితుడు నర్సింహ పరారీలో ఉన్నాడని ఎస్పీ తెలిపారు. నిందితులపై పీడీయాక్ట్‌ ప్రయోగించనున్నట్టు చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement