ప్రముఖ నటి ఇంటి స్థలంలో ఆలయ నిర్మాణం
హాజరుకానున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి,
కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి
చెన్నెలోని టి.నగర్లో రూ.6 కోట్లతో నిర్మాణం
చెన్నె: కొన్నేళ్ల కిందట ప్రముఖ నటి దానం చేసిన స్థలంలో త్వరలో పద్మావతి అమ్మవారి ఆలయం నిర్మాణం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈనెల 13వ తేదీన ఆలయ నిర్మాణ పనులు భూమి పూజతో ప్రారంభం కానున్నాయి. ఇంతకు ఆ స్థలాన్ని ఎవరో ఇచ్చారో తెలుసా.. అలనాటి నటి కాంచన. ఆ స్థలం విలువ ఇప్పుడు రూ.30 కోట్ల వరకు ఉంటుంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో ఈనెల 13వ తేదీన పద్మావతి అమ్మవారి ఆలయానికి భూమి పూజ జరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు శేఖర్ రెడ్డి తెలిపారు. చెన్నెలో గురువారం ఆయన మీడియాతో ఆలయ వివరాలు తెలిపారు. సినీ నటి కాంచన చెన్నెలోని టి.నగర్లో ఇచ్చిన స్థలంలోనే పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం చేపడుతామని చెప్పారు. ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పాల్గొంటారని వివరించారు.
అయితే ఆలయ నిర్మాణానికి దాదాపు రూ.6 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు శేఖర్ రెడ్డి తెలిపారు. రాతి కట్టడం కోసం అదనంగా మరో రూ.1.10 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. ఈ అదనపు ఖర్చును తాను భరిస్తానని ప్రకటించారు. ఇంతకీ నటి కాంచన ఎవరో తెలుసా.. అర్జున్ రెడ్డి సినిమాలో హీరో విజయ్కు నాన్నమ్మగా నటించిన ఆమెనే కాంచన. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఎన్నో చేశారు.