గవర్నర్ తొలి ప్రసంగం
ఆ తర్వాత సభలో పద్దుల సమర్పణ
30 స్థానాలతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరిగిన ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో సీఎం రంగస్వామి నేతృత్వంలోని ఎన్ఆర్ కాంగ్రెస్కు చెందిన 12 మంది, బీజేపీకి చెందిన నలుగురు, డీఎంకేకు చెందిన ఐదుగురు, తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకేకు చెందిన ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ఒకరు,ఎల్జేకే నుంచి ఒకరు, ఇతరులు ఐదుగురు గెలిచారు.
సాక్షి, చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలలో ఎన్ఆర్ కాంగ్రెస్ నేత రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయ ఢంకా మోగించి అధికారపగ్గాలను రెండవ సారిగా చేపట్టిన సంగతి తెలిసిందే. తొలుత సీఎం రంగస్వామి ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులకు 16వ శాసనసభ తొలి సమావేశాలు మే 20న కొలువైంది. కొత్తగా ఎన్నికై న సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం సభ వాయిదా పడ్డాయి. అయితే, స్పీకర్ ఎన్నిక నిర్వహణపై లెఫ్టినెంట్ గవర్నర్కు జూన్లోనే లేఖ పంపినప్పటికీ ఇంతవరకు ఆమోదం లభించలేదు. స్పీకర్ పదవిని బీజేపీ కోరుతుండగా, ముఖ్యమంత్రి రంగ స్వామి మాత్రం ఈ పదవిని మిత్ర పక్షం అన్నాడీఎంకేకు ఇవ్వాలని భావిస్తుండటంతో పీటముడి కొనసాగుతోంది.అదే సమయంలో మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగినా, శాఖల కేటాయింపునకు మరో నెల రోజులు పట్టడంతో పుదుచ్చేరి సభలో బడ్జెట్ దాఖలులో జాప్యం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు గత వారం శాఖల కేటాయింపుప్రక్రియ పూర్తైంది. అసెంబ్లీ సమావేశాల కసరత్తులు, బడ్జెట్ దాఖలుపై సీఎం రంగస్వామి దృష్టి పెట్టారు.
పుదుచ్చేరి రాజకీయ చరిత్రలో తొలిసారిగా ఒక తాత్కాలిక సభాపతి (ప్రొటెమ్ స్పీకర్) ఆధ్వర్యంలో సోమవారం ఉదయం గవర్నర్ ప్రసంగం, మధ్యాహ్నం బడ్జెట్ దాఖలు చేయనున్నారు. ప్రభుత్వం ఏర్పాటై మూడు నెలల తర్వాత సభలో బడ్జెట్ ప్రవేశపెడుతుండడంతో ఉత్కంఠ నెలకొంది.
తొలి సారిగా..
సాధారణంగా పూర్తిస్థాయి స్పీకర్ ఎన్నుకోబడిన తర్వాతే ఆయన నేతృత్వంలో గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ దాఖలు జరుగుతాయి. అయితే ఎన్నికలు ముగిసి 100 రోజులు దాటినా దీనిపై నిర్ణయం కాకపోవడంతో, సోమవారం ఉదయం 9:30 గంటలకు ప్రొటెమ్ స్పీకర్ నేతృత్వంలోనే అసెంబ్లీ సమావేశం కానుంది. ఉదయం 9:30 గంటలకు బడ్జెట్ సమావేశాలను ప్రారంభించేందుకు విచ్చేసే లెఫ్టినెంట్ గవర్నర్ కై లాసనాథన్కు ప్రొటెమ్ స్పీకర్ అన్బళగన్ స్వాగతం పలుకుతారు. అనంతరం గవర్నర్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆతర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం కానున్నది. ఇందులోఒ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై సభా వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకోనుంది. మధ్యాహ్నం 3:00 గంటలకు ఆర్థిక శాఖ బాధ్యతలను కూడా చూస్తున్న ముఖ్యమంత్రి రంగసామి 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. కాగా, ఈ ఏడాది పుదుచ్చేరి బడ్జెట్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 14,300 కోట్ల కేటాయింపులకు ఆమోదం తెలిపింది. ఈ దృష్ట్యా,ఎన్నికల వాగ్దానాలు అమల్లోకి వచ్చేనా, ప్రజాహితం పథకాలు రంగస్వామి ప్రకటించేనా అన్న ఎ దురు చూపులుపుదుచ్చేరిలో నెలకొన్నాయి.అ దే సమయంలో సభలో తొలి ప్రాధాన్యత తమిళ్ తాయ్ వాల్తుకే అని పదే పదే ఇప్పటికే సీఎం రంగస్వామి స్పష్టం చేస్తూ వస్తున్నారు. అయితే, లెఫ్టినెంట్ గవర్నర్ సభకు హాజరు అవుతోన్ననేపథ్యంలో తమిళ తాయ్ వాల్తుకు ప్రాధాన్యత ఇచ్చేనా లేదా,వందే మాతరం,జాతీయ గతం తదుపరి పాడేనా అన్న ప్రశ్న తలెత్తి ఉన్నది. గతంలో గవర్నర్ ప్రసంగం ముగిసిన మరుసటి రోజున బడ్జెట్ దాఖలు చేయడం జరిగేది.అయితే, ఈసారి తొలి సారిగా ప్రోటెం స్పీకర్ నేతృత్వంలో సభ సమావేశం కావడమే కాకుండా, ఒకేరోజు గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ దాఖలుకు చర్యలు తీసుకోవడంతో ప్రాధాన్యత సంతరించుకున్నట్టైంది. ఇక, అధికార పక్షాన్ని ఢీ కొట్టే దిశగా డీఎంకే సభ్యులు సన్నద్ధమయ్యారు.
ప్రోటెమ్ స్పీకర్ ఆధ్వర్యంలో సభా వ్యవహారాలు


