సాక్షి, చైన్నె: దేవదాయ శాఖ వ్యవహారాలపై మాజీ మంత్రి శేఖర్బాబు నిఘా పెట్టారని, భయం కారణంగానే ఆయన ఇలా చేస్తున్నారని ఆ శాఖ మంత్రి రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. తిరుచ్చి విమానాశ్రయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ‘దేవాదాయ శాఖకు చెందిన కొందరు అధికారులు మాజీ మంత్రి శేఖర్బాబుకు సమాచారాన్ని చేరవేస్తూ డిటెక్టివ్లుగా వ్యవహరిస్తున్నట్టుందని మండిపడ్డారు. తప్పులు జరిగినట్లు తేలితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వ హయాంలో భక్తులకు ఉపయోగపడని అనేక అనవసర ప్రాజెక్టులను చేపట్టారని, వాటిని మాత్రమే తాము ప్రస్తుతం నిలిపి వేశామన్నారు. ఆలయాలలో జరుగుతున్న అక్రమాలను అరికట్టడానికి నిరంతరం చర్యలు తీసుకుంటున్నామన్నారు.. 100 రోజుల్లోనే అద్భుతాలు జరిగిపోవడానికి ప్రభుత్వ పాలన సినిమా కాదన్నారు.
మొబైల్ ఫోన్లపై నిషేధం
తమిళనాడులోని 50 ప్రముఖ దేవాలయాల్లోకి భక్తులు మొబైల్ ఫోన్లు తీసుకువెళ్లకుండా నిషేధం అమలు చేస్తున్నామన్నారు. ఫోన్లను సురక్షితంగా ఉంచుకోవడానికి బయట కౌంటర్ల ద్వారా ఏర్పాట్లు చేశామన్నారు. . తిరుపతి వెళ్లే భక్తులు ఫోన్లు తీసుకెళ్లనట్లే, తమిళనాడులోని ఆలయాల్లోనూ భక్తులు ఆ మానసిక స్థితికి రావాలని పిలుపు నిచ్చారు.
అన్బిల్ మారియమ్మన్ ఆలయ వివాదం
భక్తులు వచ్చి పూజలు చేయడానికి వీలుగా తంజావూరు అన్బిల్ మారియమ్మన్ ఆలయంలో విశ్రాంతి మండపం నిర్మిస్తున్నామన్నారు. అయితే డీఎంకే నేతలు మాత్రం వ్యాధిగ్రస్తులను అక్కడే ఉంచుతామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ అందరి గళం వినేందుకు స్పీకర్ అవకాశం ఇస్తున్నారన్నారు. ఇతర పార్టీల నుంచి తమిళగ వెట్రి కళగంలో చేరిన యువతను ముఖ్యమంత్రి సక్రమంగానే నడిపిస్తారని, వారికి సరైన స్థానం కల్పిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.


