సాక్షి, చైన్నె: మెరీనా తీరంలోని తమిళనాడు ఉన్నత విద్యామండలి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జయలలిత విగ్రహాన్ని ప్రభుత్వం సక్రమంగా పర్యవేక్షిస్తోందని ఉన్నత విద్యాశాఖ మంత్రి పి.విశ్వనాథన్ అసెంబ్లీలో వెల్లడించారు. అన్నాడీఎంకే మాజీ మంత్రి, ఎమ్మెల్యే సి.వి.షణ్ముగం జీరో అవర్లో ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఉన్నత విద్యామండలి ప్రాంగణంలో ఉన్న మాజీ సీఎం జయలలిత విగ్రహాన్ని సరిగ్గా పర్యవేక్షించడం లేదని తెలిపారు. జయంతి రోజున మాత్రమే పూలమాల వేస్తున్నారని తెలిపారు. తమ సొంత ఖర్చులతో ప్రతిరోజూ జయలలిత విగ్రహానికి పూలమాల వేయాలని భావిస్తున్నామన్నారు. దీనిపై సీఎంకు లేఖ ఇచ్చామని, తమ విజ్ఞప్తిని నెరవే ర్చాలని కోరారు. ఇందుకు ఉన్నత విద్యాశాఖ మంత్రి విశ్వనాథన్ స్పందిస్తూ మాజీ సీఎం జయలలిత ప్రాముఖ్యతను ప్రభుత్వం ఎప్పటికీ తగ్గనివ్వదన్నారు. 2022 నుంచి ఈ విగ్రహాన్ని సమాచార, పౌరసంబంధాల శాఖ డైరెక్టర్ ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారని వివరించారు.
తమిళనాడు హైకోర్టు
మద్రాసు హైకోర్టు పేరును తమిళనాడు హైకోర్టుగా మార్చాలన్న ప్రతిపాదనను సీవీ షణ్ముగం తీసుకొచ్చారు. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న హైకోర్టులను ఆయా రాష్ట్రాల పేరిట పిలుస్తున్నా రని తెలిపారు. ఈ ప్రభుత్వమైనా మద్రాసు హైకోర్టు పేరును తమిళనాడు హైకోర్టుగా మార్చాలని కోరారు. అన్నాడీఎంకే మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి మాట్లా డుతూ కోయంబత్తూరులో భూమి విలువ సున్న అన్నట్టుగా పరిస్థితి మారిందని సభ దృష్టికి తెచ్చారు.


