సాక్షి, చైన్నె: తమిళనాడు హక్కులు దెబ్బతింటాయని తెలిసీ నియోజకవర్గాల పునర్విభజన (డెలిమిటేషన్)ను సమర్థించేవారు తమిళనాడుకు వ్యతిరేకులని, డీఎంకే తమ కొత్త మిత్రులు ఎవరో స్పష్టం చేయాలని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు మణికంఠం ఠాకూర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లును నిరసిస్తూ తమిళనాడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేడవాక్కంలో శాంతియుత ప్రదర్శన (ర్యాలీ) ఆదివారం నిర్వహించారు. మణికంఠాకూర్ నాయకత్వంలో జరిగిన ఈ ప్రదర్శనలో ఎంపీ ప్రవీణ్ చక్రవర్తి, పలువురు నాయకులు, కార్యకర్తలు నల్ల బుడగలు చేతబూని ‘డెలిమిటేషన్ బిల్లును రద్దు చేయాలి‘ అని నినాదాలు చేశారు. లోక్సభ స్థానాల సంఖ్య: ప్రస్తుతం ఉన్న 543 ఎంపీ స్థానాల సంఖ్య సరిపోతుందని, తమిళనాడులోని 39 పార్లమెంట్ స్థానాల్లో ఒక్కదాన్ని కూడా పెంచడం గానీ, తగ్గించడం గానీ చేయకూడదని ఈ సందర్భంగా మాణిక్యం టాగూర్ స్పష్టం చేశారు. ఈ సంఖ్య పరిమితిలోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేయవచ్చని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల తమిళనాడు హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం తీవ్రంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఇప్పటివరకు తమిళనాడుకు ఎలాంటి న్యాయం చేయలేదని, వివక్ష చూపుతున్నారని విమర్శించారు.
విజయ్ అఖిలపక్ష సమావేశానికి మద్దతు
తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు సీఎం విజయ్ అన్ని పార్టీల ఎంపీలను పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమని, ఆ సమావేశానికి హాజరుకాకుండా దాన్ని చులకన చేయడం తమిళనాడుకే నష్టమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ చెప్పినట్లే వింటామని చెబుతున్న అన్న డీఎంకే, పీఎంకేలు తమిళనాడుకు నమ్మకద్రోహులని విమర్శించారు.
ఒత్తిళ్లకు తలొగ్గేది లేదు
విజయ్ సమావేశం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ఒత్తిడి తెచ్చిందంటూ అన్బుమణి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. విజయ్ ఎవరి ఒత్తిడికీ తలవంచే వ్యక్తి కాదని, ఒత్తిళ్లకు లొంగిపోవడం అనేది అన్బుమణి, ఎడప్పాడి పళనిస్వామికే వర్తిస్తుందని అన్నారు. ఇదే సమయంలో డీఎంకే తమ కొత్త మిత్రులెవరో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


