సాక్షి, చైన్నె: పూజించడం లేదా ఆరాధన చేసుకోవడం అనేది మతపరమై రాయితీ కాదని, అది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కుని ద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. ఆనంద్ వెంకటేష్ ఉద్ఘాటించారు. అడ్వకేట్ మనురాజ్ షణ్ముగ సుందరం రచించిన ’ది పీప్ ప్లస్ శాంక్టమ్ పుస్తకావిష్కరణ కార్యక్రమం చైన్నె కార్పొరేషన్ పరిధిలోని విక్టోరియా హాల్ లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ ఆనంద్ వెంకటేష్ పుస్తక తొలి ప్రతిని ఆవిష్కరించి, సీనియర్ అడ్వకేట్ రమణి నటరాజనన్కు అందించారు.
చారిత్రక పోరాటాల
ప్రాముఖ్యత పుస్తకావిష్కరణ
అనంతరం జస్టిస్ ఆనంద్ వెంకటేష్ మాట్లాడుతూ..ఇది కేవలం ఒక పుస్తక విడుదల వేడుక మాత్రమే కాదని, సమానత్వం వైపు మన సమాజం సాగించిన ప్రయాణాన్ని, ఎదుర్కొన్న కష్టమైన పోరాటాలను గుర్తుచేసుకునే ఒక చారిత్రక క్షణమని పేర్కొన్నారు. ఆలయ ప్రవేశ ఉద్యమాలు ఎందుకు ప్రాధాన్యత సంతరించుకున్నాయి? చరిత్రలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, పెరియార్ వంటి మహనీయులు ఎంతటి ఉన్నతమైన స్థానంలో నిలిచారో ఈ పుస్తకం స్పష్టంగా వివరిస్తుందన్నారు.
చట్టాల పరిణామక్రమం 1924 నాటి వైకం సత్యాగ్రహం నుండి 1925 మద్రాస్ హిందూ మత ధర్మాదాయ చట్టం వరకు, అలాగే ప్రస్తుత అమల్లో ఉన్న చట్టాల వరకు అన్ని చారిత్రక ఘట్టాలను ఇందులో సమగ్రంగా నమోదు చేశారని తెలిపారు. గతం నుండి స్వీయ మర్యాద, సామాజిక న్యాయ పోరాటాల ద్వారా ఎంత దూరం ముందుకు వచ్చామో తెలియజేసే ఒక ముఖ్యమైన చారిత్రక పత్రంగా ఈ గ్రంధం నిలుస్తుందని ప్రశంసించారు.
యువతకు మార్గదర్శకం : ఎంపీ కనిమొళి
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ వైకం పోరాట శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో, సామాజిక న్యాయ నేపథ్యాన్ని వివరించేలా ఈ పుస్తకం వెలువడటం చాలా ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. మన హక్కులు, సామాజిక మార్పు కోసం సాగిన పోరాటాల గురించి నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దానికి ఈ పుస్తకం సరైన మార్గదర్శిగా ఉపయోగపడుతుందని వివరించారు.


