న్యూస్రీల్
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
● ప్రతిపక్షాల పట్టుతో తీర్మానంపై చర్చ
● సభ్యుల మధ్య మాటల తూటాలు
సాక్షి, చైన్నె : అసెంబ్లీలో కావేరి జలాల వివాదం, మేఘదాతు డ్యామ్ నిర్మాణం వ్యవహారం శుక్రవారం అసెంబ్లీలో చర్చకు వచ్చింది. డీఎంకే, అన్నాడీఎంకే తదితర పార్టీల పట్టు మేరకు తీర్మానంపై చర్చకు స్పీకర్ జేసీడీ ప్రభాకర్ అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో ప్రతిపక్ష, పాలకపక్షం సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశాలలో మూడో రోజు శుక్రవారం ఉదయం సంతాప తీర్మానాలను తొలుత స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ప్రవేశ పెట్టారు. ఆ మేరకు ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలతో పాటు సినీ దర్శకుడు భాగ్యరాజ, గాయని జానకి తదితరులకు సభ నివాళులర్పించింది. అనంతరం సభలో కావేరి వ్యవహారంపై ప్రతి పక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు స్పీకర్ అనుమతి ఇచ్చారు. తొలుత ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయ నిధి స్టాలిన్ ప్రసంగించారు. మేఘదాతు ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. కావేరి నీరు రాకపోవడంతో తమిళనాడులో కురువై (ఖరీఫ్) పంట తీవ్రంగా దెబ్బతిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, ఢిల్లీకి ఎందుకు వెళ్లడం లేదని, సీఎం విజయ్ కర్ణాటక వెళ్తున్నారని మొదట వార్తలు వచ్చాయని, తర్వాత ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. డెల్టా జిల్లాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించి రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.


