కృత్రిమ అవయవాల పంపిణీ
సాక్షి, చైన్నె: జైటో చైన్నె చాప్టర్ తమ జైటో జాబ్స్ విభాగం శుక్రవారం దివ్యాంగుల కోసం ప్రత్యేక మెగా జాబ్మేళా నిర్వహించింది. జైటో చైన్నె చాప్టర్ చైర్మన్ రాజేష్చందన్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల నైపుణ్యాలకు తగిన అవకాశాలను కల్పించి, సమాజంలో వారిని భాగస్వాములను చేయడానికే జాబ్ మేళా నిర్వహించినట్టు తెలిపారు. ఐపీఎస్ అధికారి బండి గంగాధర్ మాట్లాడుతూ ప్రత్యేక ప్రతిభావంతులకు గౌరవప్రదమైన ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై అభినందించారు. జైటో జాబ్స్ కన్వీనర్ అజయ్ నహార్ మాట్లాడుతూ 35 ప్రముఖ కంపెనీల ద్వారా 328 మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు.ముక్తి టీమ్, శ్రీ గీతా భవన్ ట్రస్ట్, స్వచ్ఛంద సేవకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముక్తి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు కృత్రిమ కాళ్లు, ప్రత్యేకంగా రూపొందించిన చేతులు ఇతర సహాయక పరికరాలను అందజేశారు.
పొన్ముడికి కోర్టులో ఊరట
పీటీ వారెంట్ ఉప సంహరణ
సాక్షి, చైన్నె : పీటీ వారెంట్ జారీ అయిన కేసులో డీఎంకే మాజీ మంత్రి పొన్ముడి స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. దీంతో ఆయనపై ఉన్న వారెంట్ను చైన్నె జార్జ్ టౌన్ కోర్టు ఉపసంహరించుకుంది. చైన్నెలో 2025 ఏప్రిల్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ మంత్రి పొన్ముడి మాట్లాడుతూ శైవ, వైష్ణవ మతాలు, మహిళల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పొన్ముడిపై చైన్నె కార్పొరేషన్ కౌన్సిలర్ ఉమా ఆనందన్ ప్రైవేట్ ఫిర్యాదు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణను రద్దు చేయాలని కోరుతూ పొన్ముడి దాఖలు చేసిన పిటిషన్ను చైన్నె హైకోర్టు గత నెల 2న కొట్టివేసింది. అంతేకాకుండా ఆరు నెలల్లోగా ఈ విచారణను పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ కేసు గురువారం జార్జ్ టౌన్ కోర్టులో విచారణకు వచ్చినప్పుడు పొన్ముడి హాజరుకాలేదు. దీంతో ఆయనపై కోర్టు ిపీటీ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో జార్జ్ టౌన్ కోర్టు న్యాయమూర్తి సుందరపాండ్యన్ ముందు పొన్ముడి శుక్రవారం స్వయంగా హాజరై తనపై ఉన్న పీటీ వారెంట్ను ఉపసంహరించుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను స్వీకరించిన న్యాయమూర్తి సుందరపాండ్యన్ పొన్ముడికి వ్యతిరేకంగా జారీ చేసిన పీటీ వారెంట్ను ఉపసంహరించుకుంటూ కేసు విచారణను ఆగస్టు 13కి వాయిదా వేశారు.


