సాక్షి, చైన్నె: తమిళనాడు శాసనసభ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం తమ తొలి సాధారణ బడ్జెట్ (2026–2027) ను సభలో ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి మరియా విల్సన్ ఉదయం 10 గంటలకు బడ్జెట్ ప్రతిపాదనలను తొలి సారిగా అసెంబ్లీలో సమర్పించనున్నారు. గురువారం వ్యవసాయ శాఖ మంత్రి వినోద్ ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. స్పీకర్ జె.సి.డి. ప్రభాకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు అన్నది నిర్ణయించన్నారు. ఈ సమావేశాలు సుమారు 30 నుండి 35 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది.
బడ్జెట్లో మహిళలు, యువతకు ప్రాధాన్యత
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రధాన హామీలను ఈ బడ్జెట్లో చేర్చనున్నట్లు సమాచారాలు వెలువడ్డాయి. మహిళా సంక్షేమం దిశగా కుటుంబ పెద్దలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం పథకం ప్రకటన. స్వయం సహాయక బందాలకు రూ. 7,000 కోట్ల వడ్డీ లేని రుణాలు. అన్ని నగర, పట్టణ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు రూ. 20 లక్షల వరకు పూచీకత్తు లేని విద్యా రుణాలు. ఉచిత ఆరోగ్య పరీక్షలు, నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ. 4,000 నిరుద్యోగ భృతి , గ్యాస్ సిలిండర్లపై రాయితీలపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారాలు వెలువడ్డాయి.
సీఎం విజయ్ అధ్యక్షతన టీవీకే ’ ఎమ్మెల్యేల భేటీ
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో, ఈ సాయంత్రం పనయూర్ ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయంలో సీఎం విజయ్ అధ్యక్షతన టీవీకే మంత్రులు , ఎమ్మెల్యేల కీలక సమావేశం జరిగింది. అసెంబ్లీలో ప్రతిపక్షాల ప్రశ్నలను ఎదుర్కొనే విధానం, సభలో పాటించాల్సిన క్రమశిక్షణ, బడ్జెట్ ఆమోదంపై ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
వాడివేడి చర్చలకు సిద్దంగా ప్రతి పక్షాలు
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, కావేరీ నీటి సమస్య, మేఘాదాతు వ్యవహారం, విద్యుత్ కోతలు, నీట్ ప్లాన్ వంటి అంశాలపై డీఎంకే ,అన్నాడీఎంకేలో టీవీకేను ఢీ కొట్ట బోతున్నాయి. ఇక, ప్రధాన ప్రతి పక్ష నేత ఉదయ నిధి స్టాలిన్ అరెస్టు వ్యవహారం దుమారం రేపనున్నాయి.అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కామరాజర్ సాలై పరిసరాలను నిఘా నీడలోకి తీసుకొచ్చారు.అసెంబ్లీ, సచివాలయంలోకి వెళ్లే వారికి కఠిన ఆంక్షలు విధించారు.


