ఢిల్లీ సీఎంను కలిసిన వీఐటీ చాన్స్లర్ విశ్వనాథన్
వేలూరు: వేలూరు వీఐటీ యూనివర్సిటీ చాన్స్లర్ జీ విశ్వనాథన్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాను మర్యాద పూర్వకంగా కలిసినట్లు వీఐటీ యూనివర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. గత వారంలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్తో ఆయన భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రిని వీఐటీ చాన్స్లర్ విశ్వనాథన్ నేరుగా కలిసి పుస్తకాన్ని అందజేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
జుజూవాడి చెక్పోస్ట్పై
విజిలెన్స్ దాడులు
సాక్షి, చైన్నె : కృష్ణగిరి జిల్లా హోసూర్ సమీపంలో తమిళనాడు–కర్ణాటక సరిహద్దులో ఉన్న జుజూవాడి ఆర్టీఓ ఇన్వర్డ్ , అవుట్వర్డ్ చెక్పోస్టులపై తమిళనాడు అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం వేకువ జామున దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో లెక్కల్లో చూపని రూ.3,36,200 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణగిరి జిల్లా అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ జయకుమార్ నాయకత్వంలో 10 మందికి పైగా పోలీసులు ఉదయం 5.00 గంటలకు సోదాలు ప్రారంభించారు. దాదాపు మూడన్నర గంటలకు పైగా సాగిన ఈ దాడులు ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ముగిశాయి. ఇనన్వర్డ్ చెక్పోస్ట్లో మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ సుమతి, ఆమె సహాయకురాలు మహాలక్ష్మి, అవుట్వర్డ్ చెక్పోస్ట్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మహాలక్ష్మి, ఆమె సహాయకురాలు విజయను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
చైన్నె యువకుడి హత్య
అన్నానగర్: చైన్నెలోని వ్యాసర్పడికి చెందిన నవీన్ (25) కోయంబత్తూరు లోని ఒక ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నాడు. కాలేజీకి రాకపోకలు సౌకర్యవంతంగా ఉండేందుకు, అతను పీలామేడు సమీపంలోని ఓడియంపాలయం, అశోక్ నగర్ లోని ఒక ఇంట్లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. నవీన్ గతేడాది తన కాలేజీ చదువు పూర్తి చేశాడు. ఆ తర్వాత కూడా, అతను తన స్నేహితులతో అదే గదిలో ఉంటూ, పని వెతుక్కుంటూ కోయంబత్తూరుకు వచ్చాడు. ఇంతలో, సోమవారం రాత్రి నవీన్ తన స్నేహితులతో కలిసి ఆ ప్రాంతంలోని ఒక గుడి దగ్గర కూర్చుని మద్యం తాగుతున్నాడు. అప్పుడు ఒక ముఠా అక్కడికి వచ్చింది. ఆ ముఠా సభ్యులు నవీన్పై దాడి చేశారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆ ముఠా అక్కడి నుండి పారిపోయారు. పీలామేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పట్టాకత్తితో కేక్ కటింగ్
నిందితుల అరెస్ట్
తిరువొత్తియూరు: దిండిగల్ జిల్లా నత్తం సమీపంలోని సిరుగుడి గ్రామానికి చెందిన ప్రదీప్ (27) తన పుట్టినరోజు వేడుకలను స్నేహితులతో కలిసి ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం స్నేహితులందరినీ పిలిపించి, ఒక పెద్ద పట్టాకత్తితో కేక్ కట్ చేసి పుట్టినరోజు జరుపుకున్నాడు. దీనిని అతని స్నేహితులు సెల్ఫోన్ ద్వారా వీడియో, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో వేగంగా వైరల్ కావడంతో, దీనిపై నత్తం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు ఆధారంగా నత్తం పోలీస్ ఇన్ర్ పొన్ గుణశేఖరన్ సిరుగుడిలో ఉన్న ప్రదీప్ అతని స్నేహితుడు సంతోష్లను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
ఇంటిపై పెట్రోల్ బాంబుదాడి
ముగ్గురి కోసం గాలింపు
తిరువొత్తియూరు: చైన్నె పెరియమేడు ఎన్.హెచ్. రోడ్డు 4వ వీధికి చెందిన భాస్కర్ భార్య కలైవాణి (60). సోమవారం రాత్రి వీరు ఇంట్లో ఉన్న సమయంలో, కత్తులతో వచ్చిన ఒక అపరిచిత ముఠా హఠాత్తుగా వీరి ఇంటిపై పెట్రోల్ బాంబును విసిరింది. అది పెద్ద శబ్దంతో పేలి మంటలు అంటుకున్నాయి. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన స్థానికులు అక్కడకు భారీగా తరలివచ్చారు. అంతలోనే ఆ గుర్తు తెలియని వ్యక్తులు అక్కడి నుండి మోటార్ సైకిల్పై పారిపోయారు. పెట్రోల్ బాంబు పేలుడు వల్ల అంటుకున్న మంటలను స్థానికులు శ్రమించి ఆర్పివేశారు. పెరియమేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా విచారణ చేపట్టారు. ఈ ఘటన జరిగిన ఇంటి మొదటి అంతస్తులో సదగతుల్లా (60) కుటుంబం నివసిస్తోంది. పెట్రోల్ బాంబు విసిరిన వ్యక్తులు ఎవరినైనా చంపాలనే ఉద్దేశంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారా అనే కోణంలో పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి వేపేరి అసిస్టెంట్ కమిషనర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. పరారీలో ఉన్న ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకోవడానికి 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.


