తమిళసినిమా: ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్లతో సంగీత ప్రియులను ఆకట్టుకుని, ఆ తర్వాత సినీ సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి ,ఆపై కథానాయకుడిగా, దర్శకుడిగా పరిచయమైన నటుడు హిప్ హాప్ ఆది. ఇలా సినిమా రంగంలోని పలు శాఖలో తన ప్రతిభను చాటుకుంటూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హిప్ హాప్ ఆది తాజాగా మీసై మురుక్కు –2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఈయన 2017లో కథానాయకుడిగా సంగీత దర్శకుడుగా బాధ్యతలు నిర్వహించి విజయానికి సాధించిన మీసై మురుక్కు చిత్రానికి సీక్వెల్ కావడం గమనార్హం. తన తాజా చిత్రం నుంచి హిప్ హాప్ ఆది మీడియాకు విడుదల చేసింది ప్రకటనలో పేర్కొంటూ మీసై మురుక్కు చిత్రంతో ప్రారంభమైన తన సక్సెస్ ఫుల్ పయనం ఇప్పుడు కోట్లాది మంది భావనగా మారిందన్నారు. దాన్ని ఇప్పుడు మరోసారి మీసై మురుక్కు –2 చిత్రంతో అనుభవించే తరుణం వచ్చిందన్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, వాళ్లంతా థియేటర్లను సంగీత ఉత్సవముగా మార్చడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. మీసై మురుక్కు –2 చిత్రం మాత్రమే కాదని, థియేటర్లో జరగనున్న బ్రహ్మాండ సంగీత ఉత్సవం అని పేర్కొన్నారు. చిత్రంలో ప్రేమ , వినోదం ,స్నేహం,కుటుంబ అనుబంధాలు, ఉత్సాహపరిచే సంగీతం అంటూ ప్రేక్షకులను అలరించే మంచి కాలక్షేప కథాచిత్రంగా ఉంటుందన్నారు. చిత్రాన్ని సెప్టెంబర్ 25వ తేదీన విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు , దర్శకత్వం ,సంగీతం బాధ్యతలను ఈయన నిర్వహించారు. నటి చైత్ర జె .ఆచార్, కేతిక శర్మ, రమ్యా రంగనాథన్ నాయకలుగా నటించిన ఇందులో హర్షద్ ఖాన్, కరుణాస్, నాజర్, ఆడుగళం నరేన్, కరుణాకరన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. అవ్నీ మూవీస్, బెంజ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల అధినేతలు నటి కుష్బూ సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ కలిసి నిర్మించారు.


