ఫొటో ప్రదర్శన
సాక్షి,చైన్నె: కేరళ రాష్ట్ర సహజ సౌందర్యాన్ని, సాంస్కృతి తిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో కేరళ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన అఖిల భారత ఫోటో ప్రదర్శన చైన్నెలో బుధవారం ఏర్పాటైంది. ‘లెన్స్కేప్ కేరళ’ పేరిట నగరంలోని లలిత కళా అకాడమీలో ఈ ప్రదర్శనను ప్రారంభమైంది. ‘గాడ్స్ ఓన్ కంట్రీ’గా పిలవబడే కేరళలోని అద్భుత దృశ్యాలను 100 ప్రత్యేక ఫోటో ఫ్రేమ్ల ద్వారా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ప్రముఖ మలయాళ నటి సీమ, ప్రఖ్యాత రచయిత, విమర్శకులు సదానంద్ మీనన్ ఈ ప్రదర్శనను అధికారికంగా ప్రారంభించారు. భారతదేశంలోని 10 మంది అగ్రశ్రేణి ట్రావెల్, మీడియా ఫొటోగ్రాఫర్లు రూపొందించిన అద్భుతమైన దృశ్యరూపాలు ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మార్చి 7వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ప్రదర్శనను తిలకించే అవకాశం కల్పించారు. ఫొటోగ్రఫీపై ఆసక్తి ఉన్నవారి కోసం గురువారం మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు ‘మాస్టర్ క్లాస్’ నిర్వహిస్తామని ప్రకటించారు.
కేరళ నిజమైన కథను చాటిచెప్పేలా..
ఈ ప్రాజెక్టును ప్రముఖ ఆర్ట్ క్యూరేటర్ ఉమా నాయర్ పర్యవేక్షించగా, ప్రఖ్యాత వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్ బాలన్ మాధవన్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా వ్యవహరించారు. ఈ ప్రదర్శనపై కేరళ పర్యాటక శాఖ మంత్రి పి.ఎ. మహ్మద్ రియాస్ స్పందిస్తూ.. కేరళ అన్ని కాలాల్లోనూ పర్యాటకులను అలరించే అద్భుతమైన ప్రదేశం. తీర ప్రాంతాలు, నదులు, కొండల అందాలతో పాటు కేరళ ప్రజల ఐక్యతను, సంస్కృతిని ఈ ఫొటోలు ప్రతిబింబిస్తాయని వివరించారు. ప్రముఖ ఫొటో గ్రాఫర్లు హెచ్. సతీష్, కౌంతేయ సిన్హా, శివాంగ్ మెహతా, సైబల్ దాస్, ఉమేష్ గోగ్నా, సౌరభ్ ఛటర్జీ, నటాషా కర్తార్ హెమ్రజానీ, ఐశ్వర్య శ్రీధర్, అమిత్ పస్రిచా, మనోజ్ అరోరా వంటి నిపుణులు కేరళలోని వన్యప్రాణులు, వారసత్వ సంపద, పండుగలు, ఆధ్యాత్మికత వంటి అంశాలను తమ కెమెరాల్లో బంధించి ఇక్కడ కొలువు దీర్చారు.


