తమిళసినిమా: జియో హాట్స్టార్ సమర్పణలో ఆర్.రమేశ్బాబు, జగన్ భాస్కరన్ కలసి నిర్మించిన చిత్రం కెనత్త కాణోమ్. ఈ చిత్రానికి సురేశ్ సెంగయ్య దర్శకత్వం వహించారు. అయితే చిత్ర విడుదలకు ముందే ఆయన కన్నుమూశారు. కాగా యోగిబాబు ప్రధాన పాత్రను పోషించిన ఇందులో లవ్లిన్ చంద్రశేఖర్, రామకృష్ణన్, రేచ్చల్ రబేక, జార్జ్ మరియన్, మొట్టైరాజేంద్రన్, కవితా భారతి, కోవై పాండియన్, హలో కందస్వామి ముఖ్యపాత్రలు పోషించారు. నివాస్ కే.ప్రసన్న సంగీతాన్ని వి.త్యాగరాజన్ చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. సోమవారం సాయంత్రం చైన్నెలో భరణి స్టూడియోలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న దర్శకుడు సుశీంద్రన్ మాట్లాడుతూ ఆరు కిడాయిన్ కరుణైమను వంటి అద్భుతమైన జీవితాన్ని తెరపై ఆవిష్కరించిన దర్శకుడు సురేశ్ సెంగయ్య ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చి దిద్ది ఉంటారని భావిస్తున్నానన్నారు. చిన్న బడ్జెట్ అయినా మంచి కథలను ఎంపిక చేసుకుని నటిస్తున్న యోగిబాబు, నటనపై శ్రద్ధ చూపిస్తున్న లవ్లిన్ చంద్రశేఖర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. యోగిబాబు మాట్లాడుతూ సురేష్ సెంగయ్య తనకు కాక్కా ముట్టై చిత్రం నుంచి తెలుసన్నారు. ఆరు కిడాయిన్ కరుణై మను చిత్రంలో కాల్ షీట్స్ సమస్య వల్ల ఆ చిత్రంలో నటించలేకపోయానని చెప్పారు. అలాంటి దర్శకుడితో కలసి ఈ చిత్రం చేయడం భాగ్యంగా భావిస్తున్నానన్నారు. అలాంటి దర్శకుడు మృతిచెందడం బాధాకరమని పేర్కొన్నారు. మృతిచెందిన దర్శకుడి బిడ్డ చదువు కోసం హార్థికసాయం అందిస్తున్నానని వేదికపై ఆ కుటుంబానికి చెక్కును అందించారు.
తమిళసినిమా: 1990 ప్రాంతంలో కురక్రారు కంటికి నిద్ర కరువు చేసిన నటి రంభ. ఈమె నడక చూడడానికే పెద్ద సంఖ్యలో అభిమానులు ఉండేవారంటే అతిశయోక్తి కాదు. ఈ పదహారు అణాల తెలుగు భామ ఎనిమిది భాషల్లో మొత్తం 100కుపైగా చిత్రాల్లో కథానాయికిగా నటించి బహుభాషా నటిగా రాణించారు. సర్గం అనే మలయాళ చిత్రంతో 1991లో కథానాయకిగా పరిచయమై , ఆ వెంటనే. మాతృభాషలో (తెలుగు) ఆ ఒక్కటి అడక్కు చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. అంతే ఆ తరువాత ఈ బ్యూటీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలాంటి అవసరం రాలేదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ, బోజ్పురి ఇలా ఎనిమిది భాషల్లో నటించారు. తెలుగులో చిరంజీవి, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలు, అదేవిధంగా తమిళంలో రజనీకాంత్, కమలహాసన్, కార్తీక్, అర్జున్ వంటి స్టార్ హీరోలతో జతకట్టారు. నిర్మాతగాను అవతారమెత్తిన ఈమె కొన్ని టీవీ సీరియల్స్లోనూ నటించారు. కథానాయకిగా ఫుల్ఫామ్లో ఉండగా ఇంద్రకుమార్ అనే లండన్కు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సంసార జీవితంలో స్థిరపడ్డారు. వీరి పెళ్లి 2010లో జరిగింది. రంభకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా వివాహం తరువాత నటనకు దూరంగా ఉన్న రంభ 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ నటిగా రీఎంట్రీ కావడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల చైన్నెకి చేరుకున్న ఈ భామ సినిమాల్లో అవకాశాల వేట మొదలుపెట్టారు. అందుకుగాను 49 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ శారీరక వ్యాయామాలు చేసి బరువు తగ్గి కొత్త అందాలను సంతరించుకున్నారు. సినిమా అవకాశాలు వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉండకుండా బుల్లి తెర కార్యక్రమంలో పాల్గొంటూ దర్శక, నిర్మాతల దృష్టిలో పడే ప్రయత్నాలు చేస్తున్నారు. అలా మొత్తం మీద తెలుగు, తమిళం భాషల్లో ఒక్కో అవకాశం సంపాదించినట్లు తాజా సమాచారం. వీటికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. అలా అందాల భామ రీఎంట్రీ షురూ అయింది అన్నమాట.
తమిళసినిమా: సినిమాకి కీర్తి, కిరీటాలను తెచ్చి పెట్టిన సంగీత కళాకారులెందరో ఉన్నారు. అందులో దివంగత సంగీత దర్శకుడు ఎంఎస్.విశ్వనాథన్, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గాయని వాణీ జయరాం పేర్లు కచ్చితంగా చోటు చేసుకుంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. కాలాన్ని అధిగమించి మన ప్రయాణంలో మనల్ని రంజింపజేసే కళాకారులు ఎంతో మంది ఉన్నారు. వారు మనల్ని ప్రభావితం చేయడమే కాకుండా, మన జీవితాంతం పయనిస్తారు. అలాంటి సంగీత కళాకారులే సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గాయని వాణీ జయరాం. వారిని స్మరించుకునే విధంగా వారి మధురమైన పాటలను, చర్చా వేది కలను ఒక వీడియోగా రూపొందించే బృహత్తర కార్యక్రమానికి సుమతి రామ్ శ్రీకారం చుట్టారు. ఈమె ఎంఎస్.విశ్వనాథన్ వద్ద సహాయకురాలిగా పని చేశారు. కాగా ఇప్పటికే విశ్వరాగం పేరుతో తొలి మ్యూజికల్ వీడియోను రూపొందించి విడుదల చేశారు. తాజాగా విశ్వరాగం రెండవ భాగం పేరుతో మరిన్ని స్థిరస్థాయిగా నిలిచిపోయే పాటలు, వారికి సంబంధించిన విశేషాలను మ్యూజికల్ ఆల్బమ్ను రూపొందిస్తున్నారు.


