160 రైలు సర్వీసులు రద్దు
● 5,6 ప్లాట్ఫారమ్ల నుంచే ఎలక్ట్రిక్ రైళ్లు ●20వ తేదీ అర్ధరాత్రి నుండి 45 రోజుల పాటూ మార్పులు
కొరుక్కుపేట:ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో పునరుద్ధరణ పనులు వివిధ దశల్లో సాగుతున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ రైళ్లు నడుపుతున్న 10 , 11 ప్లాట్ఫారమ్లపై తాజాగా పనులు ప్రారంభమైనందున సబర్బన్ రైలు కార్యకలాపాలలో మార్పులు చేశారు. ఈ విషయాన్ని చైన్నె రైల్వే డివిజనల్ మేనేజర్ శైలేంద్ర సింగ్ విలేకరులకు మంగళవారం తెలిపారు. ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న పునరుద్ధరణ పనుల కారణంగా, సాధారణంగా 10 , 11 ప్లాట్ఫారమ్ల నుండి నడిచే ఎలక్ట్రిక్ రైళ్లు, ఈ నెల 20వ తేదీ అర్ధరాత్రి నుండి ఏప్రిల్ 5 వరకు 5, 6 ప్లాట్ఫారమ్ల నుండి నడపనున్నారు. ఇక చైన్నె బీచ్ – తాంబరం–చెంగల్పట్టు–కాంచీపురం అరక్కోణం మార్గంలోని అన్ని ఎలక్ట్రిక్ రైళ్లు ప్లాట్ఫామ్ 6 నుండి నడుస్తాయన్నారు. అరక్కోణం – కాంచీపురం–చెంగల్పట్టు–తాంబరం సుత్తదుక్కరై మార్గంలోని అన్ని ఎలక్ట్రిక్ రైళ్లు అదే సమయంలో ఎగ్మోర్లోని ప్లాట్ఫారమ్ 5 నుండి నడపనున్నారు. కాగా ఇప్పటివరకు, 10వ , 11వ ప్లాట్ఫారమ్లపై 324 ఎలక్ట్రిక్ రైళ్లు నడుస్తున్నాయని, వీటిలో 160 రైళ్లు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ రైలు ప్లాట్ఫారమ్ మార్పు కారణంగా, రామేశ్వరం సేతు రైలు మాత్రమే తాంబరం నుండి నడుస్తుందని స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ మార్పులు గమనించి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
ఢిల్లీ వెళ్లిన గవర్నర్ ఆర్.ఎన్. రవి
కొరుక్కుపేట: రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ రవి మంగళవారం అకస్మాత్తుగా ఢిల్లీకి వెళ్లారు. 3 రోజుల పర్యటన నిమిత్తం గవర్నర్ ఆర్.ఎన్.రవి ఉదయం 6.50 గంటలకు. చైన్నె నుండి ఎయిర్ ఇండియా ప్యాసింజర్ విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. ఆయన కార్యదర్శి, భద్రతా అధికారి, సహాయకుడు ఇతరులు ఆయనతో పాటూ ఉన్నారు. కాగా 19వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ నుండి ఎయిర్ ఇండియా విమానంలో చైన్నెకి తిరిగి వస్తారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో, గవర్నర్ తదుపరి ఢిల్లీ పర్యటన చర్చనీయాంశంగా మారింది.
3 రోజులు సభా పర్వం
సాక్షి, చైన్నె : అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల పాటూ కొనసాగనున్నాయి. ఆర్థిక, వ్యవసాయ బడ్జెట్ దాఖలు అనంతరం అసెంబ్లీని స్పీకర్ వాయిదా వేశారు. అనంతరం అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఇందులో సభను ఈనెల 20వ తేది వరకు నిర్వహించేందుకు నిర్ణయించారు. 18వ తేదీన సంతాప తీర్మానాల అనంతరం, బడ్జెట్పై చర్చ ప్రారంభం కానున్నది. 19 వతేదీ కూడా చర్చ జరగనున్నది. 20వ తేదీన అదనపు ఖర్చుల నిమిత్తం ఆర్థిక నివేదిక దాఖలు, వ్యవసాయ బడ్జెట్పై చర్చ, సీఎం స్టాలిన్ ప్రసంగాలు ఉంటాయి. అలాగే, ఈ సమావేశాల వేదికగా అసెంబ్లీలో స్టాలిన్ ప్రత్యేక ప్రకటనలు చేయబోతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.
టీవీకేలోకి సుబ్రమణియన్
సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే మాజీ మంత్రి సుబ్రమణియన్ విజయ్ టీవీకేలో చేరారు. పార్టీ అధినేత విజయ్ సమక్షంలో ఆయన మంగళవారం టీవీకే కండువా కప్పుకున్నారు. అన్నాడీఎంకేలో సీనియర్లుగా ఉన్న సెంగొట్టయ్యన్, జేసీడీ ప్రభాకరన్, కుపా కృష్ణన్ వంటి నేతలు టీవీకేలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా పలుమార్లు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన సుబ్రమణియన్ గత కొంత కాలంగా అన్నాడీఎంకే అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. తాజాగా ఆయన టీవీకేలో చేరారు. మరెందరో నేతలు టీవీకేలోకి అన్నాడీఎంకే నుంచి రానున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
అన్నాడీఎంకేలోకి
అళగిరి మద్దతుదారులు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకేలో అళగిరి మద్దతుదారులు పలువురు మంగళవారం చేరారు.మాజీ మంత్రి సెల్లూరు రాజుతో కలిసి వీరంతా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామిని కలిశారు. డీఎంకే బహిష్కృత నేత, రాజకీయాలకు దూరంగా ఉన్న దివంగత కరుణానిధి పెద్దకుమారుడు అళగిరి ఒకప్పుడు మదురై వేదికగా రాజకీయ చక్రం తిప్పిన విషయం తెలిసిందే. ఆయన మద్దతు దారులెందరో నేటికి డీఎంకేకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇందులో మదురై మాజీ డిప్యూటీ మేయర్ పీఎం మన్నన్ కూడా ఒకరు. ఈ పరిస్థితులో మంగళవారం తన మద్దతుదారులు, అళగిరికి సన్నిహితంగా ఉన్న వారితో కలిసి అన్నాడీఎంకేలో మన్నన్ చేరారు. ఆయనకు పళణిస్వామి ఆహ్వానించి అన్నాడీఎంకే సభ్యత్వం అందజేశారు.
160 రైలు సర్వీసులు రద్దు


