● 32 జిల్లాల్లో సాంకేతిక విప్లవం ● యువతరం కోసమే ద్రావిడ
సాక్షి, చైన్నె: చైన్నె ట్రేడ్ సెంటర్ వేదికగా సమాచార, టెక్నాలజీ, డిజిటల్ సేవల విభాగం నేతృత్వంలో ఉమాజిన్ టీఎన్ –2026 సదస్సు గురువారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటూ జరిగే ఈ సదస్సును సీఎం స్టాలిన్ ప్రారంభించారు. వివరాలు.. వినూత్న సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా ఒక ట్రిలియన్ డాలర్లు ఆర్థిక వ్యవస్థను పెంచే లక్ష్యంతో, పారిశ్రామిక కంపెనీలతో గ్లోబల్ టెక్నాలజీ ఈవెంట్గా ఉమాజిన్ టీఎన్ను ఏర్పాటు చేశారు. ఏటా జరుగుతున్న ఈ సమ్మిట్ను కొసాగించే విధంగా ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాట్లు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్, స్పేస్టెక్, డీప్ టెక్, టెక్ నాయకత్వం, జియోస్పేషియల్ ఇన్నోవేషన్, ఏవీజీసీ సాస్ నాయకత్వం, సాంకేతిక, పారిశ్రామిక అభివృద్ధి, ఆవిష్కరణలకు వేదికగా తీర్చిదిద్దారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను సీఎం స్టాలిన్ వీక్షించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పళణి వేల్ త్యాగరాజన్, అన్బరసన్, ఎంపీ టీఆర్బాలు, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రజేంద్ర నవనీత్, తమిళనాడు ఇ–గవర్నెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ డాక్టర్ ఆల్ఫీ జాన్ వర్గీస్, తమిళనాడు ఎలక్ట్రానిక్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె.పి. కార్తికేయన్, తమిళనాడు ప్రభుత్వ కేబుల్ టీవీ కంపెనీ నిర్వహణ డైరెక్టర్ ఆర్. వైద్యనాథన్ హాజరయ్యారు.
సాంకేతిక విప్లవం
రాష్ట్రంలో ఏఐ సాంకేతిక విప్లవానికి నాయకత్వం, సాంతికేక అభివృద్ధి గురించి సీఎం స్టాలిన్ ఈ సందర్భంగా ప్రసంగించారు. తమిళనాడు అన్ని రాష్ట్రాల కంటే ఒక అడుగు ముందంజలో ఉందని వివరించారు. ఆధునికత వైపు దూకుడు, సామాజిక సమానత్వం , అందరికీ అభివృద్ధి ఫలాలు దక్కలన్న లక్ష్యంతో ద్రావిడ మోడల్ ముందుకెళ్తోందన్నారు. విద్యార్థులకు సాంకేతిక అంశాలపై మరింత విస్తృత అవగాహన కల్పన కోసమే ప్రపంచ మీ చేతుల్లో పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, ల్యాప్టాప్లను అందజేస్తున్నామని వివరించారు. సాంకేతిక రంగంలో, నేడు అందరి కన్నా ముందు వరసులో తమిళనాడు ఉందన్నారు. సేవా రంగం నుంచి ఉన్నత రంగం వరకు సాంకేతికత, ఆవిష్కరణల కేంద్రంగా తమిళనాడు అవతరించి ఉందన్నారు. ఇందులో చైన్నె నగరం తదుపరి తరం జీసీసీ కేంద్రంగా మారిందన్నారు. అధునాతన ఆర్ అండ్ డీ ఏఐ, ఫిన్–టెక్, ఆటోమోటివ్ సాఫ్ట్వేర్, ఇంజినీరింగ్, డిజైన్ తదితర ఉత్పత్తి కేంద్రాలు త్వరలో తెరపైకి రానున్నాయన్నారు. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, స్పేస్, టెక్స్టైల్, పునరుత్పాదక శక్తి, ఏఐ, ఆటోమేషన్ వంటి రంగాలలో బలమైన పునాదిని వేశామన్నారు. డేటాబేస్ , డిజిటల్ డిజైన్ను అనుసంధానించే విధంగా ఉత్పాదకత డిజిటల్ ఆవిష్కరణలను మిళితం చేశామన్నారు. సహజంగానే వ్యాపారానికి అనుకూలమైన సహజవాతావరణం తమిళనాడులో ఉంటుందని పేర్కొంటూ, టెక్నాలజీని కేవలం ఆర్థికాభివద్ధికి ఒక సాధనంగా చూడటం కంటే, ద్రావిడ మోడల్ సామాజిక పురోగతికి ఒక సాధనంగా చూడాల్సిన అవసరం ఉందని సూచించారు. తమిళనాడును ఒక ఆవిష్కరణ శక్తి కేంద్రంగా మార్చడానికి స్పష్టమైన మార్గాన్ని నిర్ధేశించామన్నారు. ఒక నగరానికే పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా సమానంగా మినీ టైడల్ పార్కులు వంటి కార్యక్రమాలు విస్తృతం చేశామన్నారు. తమిళనాడులోని 38 జిల్లాలలో, 32 జిల్లాలు కేంద్ర ప్రభుత్వ ఎస్టీపీఐ నుంచి సాప్ట్ వేర్ ఎగుమతులు జరుగుతున్నాయని వివరించారు. ఆవిష్కరణలకు తమిళనాడు అత్యుత్తమంగా ఉందని, గొప్ప ఐటీ, ఇంజినీరింగ్, మానవశక్తి, ప్రపంచ స్థాయి విద్య, కంపెనీలు, బహుళ నైపుణ్య కేంద్రాలు, భారతదేశపు మొట్టమొదటి లోతైన సాంకేతికత ఇంక్యుబేటర్ – పరిశోధన నుంచి మేధో సంపత్తి వరకు ప్రతిదీ ఇక్కడ కొలువు దీరి ఉందని వివరించారు. ఇక్కడి శక్తివంతమైన మానవ వనరులు తదుపరి స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నాయన్నారు. తమిళనాడు ఎల్లప్పుడూ అన్ని రంగాలలో అగ్రస్థానంలో ఉండాలని, యువతరం కోసం , భవిష్యత్తు వైపు ప్రయాణంలో రేపటి విజయానికి నాంది పలుకుద్దాం. విజయ పర్వం కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.
రాష్ట్ర భవిష్యత్తు వైపే ద్రావిడ మోడల్ ప్రభుత్వం ప్రయాణం అని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. 32 జిల్లాల్లో సాంకేతికతను దరి చేర్చామని, యువతరం కోసం
ద్రావిడ మోడల్ ఉందని భరోసా ఇచ్చారకు. జ్ఞానం అయినా, సాంకేతికత అయినా,
అందరికీ అందాల్సిందేనని స్పష్టం చేశారు.
● 32 జిల్లాల్లో సాంకేతిక విప్లవం ● యువతరం కోసమే ద్రావిడ


