దరఖాస్తుల హోరు
సాక్షి, చైన్నె: ఎన్నికలలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న ఆశావహుల నుంచి దరఖాస్తులు అన్నాడీఎంకే కార్యాలయానికి హోరెత్తాయి. ఇందులో 2,187 దరఖాస్తులు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి కోసం కొనుగోలు చేసి సమర్పించి ఉన్నారు. తమ నియోజకవర్గంలో అంటే తమ నియోజకవర్గంలో పోటీ చేయాలంటూ పళణిస్వామికి విజ్ఞప్తి చేశారు. వివరాలు.. అసెంబ్లీ ఎన్నికల కసరత్తులను అన్నాడీఎంకే వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కూటమిలో బీజేపీ మాత్రమే ఉన్నప్పటికీ, అధికారికంగా తమిళ మానిల కాంగ్రెస్ను, ప్రేమలత విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేను చేర్చుకోవడం, రాందాసు, అన్బుమణి మధ్య వివాదాన్ని పరిష్కరించే కసరత్తులపై దృష్టి పెట్టే రాజకీయ అడుగులు వేస్తూ వస్తున్నారు. ప్రజా చైతన్య యాత్ర ద్వారా ఇప్పటికే విస్తృతంగా రాష్ట్రంలో పళని స్వామి పర్యటించారు. తాజాగా పార్టీ తరపున పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తూ వస్తున్నారు. గత నెల 15వ తేదీ నుంచి రాయ పేటలోని పార్టీ కార్యాలయం ఎంజీఆర్ మాళిగైలో దరఖాస్తులను 23వ తేదీ వరకు స్వీకరించారు. ఆశావహుల సంఖ్య అధికంగా ఉండటంతో 28 నుంచి 31వ తేదీ వరకు సైతం సమర్పించేందుకు గడువు కేటాయించారు. తాజాగా ఈ ప్రక్రియ ముగిసింది. వచ్చిన దరఖాస్తుల పరిశీలనలో ఎంజీఆర్మాళిగై వర్గాలు నిమగ్నమయ్యాయి. ఇందులో మొత్తంగా 10,175 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 2,187 దరఖాస్తులు కేవలం పళణి స్వామి కోసం సమర్పించి ఉండటం గమనార్హం. మిగిలిన 7,988 దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించినానంతరం జిల్లాల వారీగా ఆశావహులను ఇంటర్వ్యూలకు ఆహ్వానించనున్నారు. పళణి స్వామితో పాటూ ముఖ్య నేతలు జరిపే ఇంటర్వ్యూ ఆధారంగా ఆయా నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థి ఎవరో తేలనుంది. 234 నియోజకవర్గాలలోనూ ఆశావహులు దరఖాస్తులను సమర్పించి ఉన్నారు. ఇందులోనూ బీజేపీ ఆశిస్తున్న స్థానాలను గురి పెట్టి కొందరు ముఖ్యులు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.


