
క్లుప్తంగా
అన్నానగర్: ప్రైవేట్ బస్సు కండక్టర్పై దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్రగాయాలతో అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శివగంగ జిల్లా మానామదురై సమీపంలోని సిరుకుడి గ్రామానికి చెందిన ముత్తుపాండి కుమారుడు ధవసెల్వం (23). మదురై నుంచి ఇళయంకుడి వెళ్లే ప్రైవేట్ బస్సులో కండక్టర్. శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని మానామదురై కొత్త బస్టాండ్లో బస్సు దిగాడు. ఆ సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ధవసెల్వంను వెంటపడి కత్తులతో నరికి పారిపోయారు. ఇది చూసిన ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలిసి మదురై పోలీసులు అక్కడికి వెళ్లి తీవ్రంగా గాయపడిన ధవసెల్వంను శివగంగై ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
రూ. 62 లక్షల పరిహారం
అన్నానగర్: చైన్నెలోని తిరువల్లికేణిలోని కపాలినగర్కు చెందిన తంగ రాజ్ (48) చేపాక్లోని రాష్ట్ర ప్రణాళికా సంఘం కార్యాలయంలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. 21.10.2023న, అతను తన భార్య మోహనతో కలిసి కామరాజ్ సాలైలోని ఎళీలగమ్ సమీపంలో మోటార్ బైక్పై వెళుతుండగా, ఆ దారిలో వెళుతున్న మోటార్ సైకిల్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తంగరాజ్ మృతిచెందాడు. దీని తరువాత మోహన చైన్నె మోటార్ యాక్సిడెంట్ కాంపన్సేషన్ ట్రిబ్యునల్లో రూ. 95 లక్షల పరిహారం కోరుతూ కేసు దాఖలు చేసింది. ఈ పిటిషన్పై న్యాయమూర్తి నజీర్ అహ్మద్ ముందు విచారణ జరిగింది. ఈ పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ పిటిషనర్కు రూ.62.35 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. పిటిషనర్ భర్త నడుపుతున్న మోటార్ సైకిల్ను ఢీకొట్టిన మరో మోటార్ సైకిల్ అజాగ్రత్త, వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.
సాక్షి, చైన్నె: పీఎంకే గౌరవాధ్యక్షుడు జీకే మణి ఆస్పత్రిలో చేరారు. ధర్మపురిలో ప్రథమ చికిత్స అనంతరం ఆయన్ను చైన్నెకి తరలించారు. పీఎంకేలో రాందాసు, అన్బుమణి మధ్య జరుగుతున్న సమరంలో జీకే మణి నలిగిపోతూ వస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. తాను తీవ్ర మనోవేదనతో ఉన్నట్టుగా ఇది వరకు ఆయన తెలిపారు. అయినా రాందాసు వెన్నంటే ఉంటున్నారు. అన్బుమణి చర్యలను తప్పబట్టే విధంగా ముందుకెళ్తున్నారు. ఈపరిస్థితుల్లో అన్బుమణిపై చర్యలకు రాందాసు సన్నద్ధం అవుతున్న వేళ తీవ్ర ఒత్తిడికి ఆయన లోనైనట్టు తెలిసింది. శుక్రవారం రాత్రి ఆయన అస్వస్థతకు లోనైనట్టు, ధర్మపురిలోని ఓ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. అక్కడ ప్రథమ చికిత్సతో ఆయన్ను చైన్నెకి తరలించారు. ఇక్కడి అపోలో ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆయన ఆరోగ్యంపై ఆందోళన వద్దని, త్వరితగతిన డిశ్చార్జ్ అవుతారని మద్దతు దారులు తెలిపారు.
కొరుక్కుపేట: చైన్నెలోని బెసెంట్ నగర్లోని అన్నై వేలంగని ఆలయం 53వ వార్షిక ఉత్సవం 29న ధ్వజారోహణంతో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 8న ఈ ప్రసిద్ధ ఆలయంలో వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. పండుగ మొదటి రోజు చైన్నె మైలాపూర్ ఆర్చ్డయోసెస్ ఆర్చ్ బిషప్ జార్జ్ ఆంథోనీ స్వామి జెండా ఎగురవేసి కార్యక్రమం ప్రారంభం అవుతుందని దీనికి ఆలయ ఫాదర్ అరుళప్ప అధ్యక్షత వహిస్తారు. ఈ నెల 30వ తేదీన సాయంత్రం ప్రత్యేక పూజలు జరుగుతాయని ఈ ప్రార్థనల్లో మాజీ ఆర్చ్ బిషప్ ఎ.ఎం. చిన్నప్ప ఇందులో పాల్గొంటారు. 31వ తేదీన ఉమ్మడి పూజ జరుగుతాయని, బిషప్ సింగరాయన్ ప్రత్యేక అతిథిగా హాజరవుతారని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. చివరి రోజున మేరీమాత పట్టాభిషేక మహోత్సవం జరుగుతుందని, బెసెంట్ నగర్ లోని వేళంకన్ని ఆలయానికి చైన్నెతోపాటూ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు విచ్చేయనున్నారు. ఈ ఏడాది కూడా భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఫాదర్ అరుళప్ప తెలిపారు.
కొరుక్కుపేట: చైన్నె నుంచి సేలం వెళ్లే ఇండిగో ఎయిర్లైన్స్ ప్యాసింజర్ విమానం శుక్రవారం రాత్రి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఆ విమానంలో ప్రయాణించడానికి వచ్చిన ప్రయా ణికులను భద్రతా అధికారులు స్క్రీనింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో సేలంకు చెందిన సురేష్ (35) అనే ప్రయాణికుడి వద్ద తనిఖీలు చేశారు. అతని బ్యాగ్లో పరిశోధన కోసం ఉపయోగించగల జీపీఎస్ పరికరం ఉన్నట్లు గుర్తించారు. విమానయాన భద్రతా నిబంధనల ప్రకారం జీపీఎస్ పరికరాలను విమానంలో తీసుకెళ్లకూడదు. దీని తరువాత, వారు అతని ప్రయాణాన్ని రద్దు చేసి, అతని నుంచి ఆ పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అతను సేలం నుంచి వచ్చాడని, అతను ఖనిజ వనరుల గనిని మైనింగ్ లీజుకు తీసుకుంటున్నాడని వెల్లడైంది. సురేష్ను చైన్నె విమానాశ్రయ పోలీస్స్టేషన్కు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.