
వెబ్ ప్రపంచంలోకి ప్రియాంక మోహన్
తమిళసినిమా: ఎప్పుడైతే అవకాశాలు తగ్గుముఖం పడతాయో అప్పుడు మన హీరోయిన్ల దృష్టి పడేది బుల్లి తెరపైకే. అయితే ఇప్పుడు వెబ్ ప్రపంచంలోకి అన్నట్లుగా మారింది. ప్రస్తుతం నటి ప్రియాంక మోహన్ పరిస్థితి ఇదే. ఈ కన్నడ భామ కన్నడం, తెలుగు, తమిళం భాషల్లో నటించి బహు భాషా కథానాయకిగా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో నాని గ్యాంగ్ లీడర్ చిత్రం ద్వారా పరిచయం అయింది. ఆ తర్వాత తమిళంలో శివ కార్తికేయన్కు జంటగా డాక్టర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో ఆ తర్వాత అదే హీరోతో డాన్ చిత్రంలో నటించి మరో హిట్టు అందుకుంది. అలా సూర్య సరసన ఎదర్కుమ్ తుణిందవన్, ధనుష్తో కెప్టెన్ మిల్లర్ చిత్రాల్లో నటించింది. అదేవిధంగా ఇటీవల తెలుగులో మరోసారి నానితో సరిపోదా శనివారం చిత్రంలో నటించి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత పవన్ కల్యాణ్కు జంటగా ఓజీ చిత్రంలో కమిట్ అయింది. అంతే ఆపై ఈమెకి మరో అవకాశం రాలేదు. అలాంటి పరిస్థితుల్లో నటుడు ధనుష్ దర్శకత్వం వహించి నిర్మించిన నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం చిత్రంలో ఒక ప్రత్యేక పాటలో నటించే అవకాశం కల్పించారు. ప్రత్యేక పాట కూడా ప్రియాంక మోహన్కు పెద్దగా హెల్ప్ కాలేదు. తెలుగు చిత్రం ఓజీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితి. దీంతో ప్రియాంక మోహన్ ఖాళీగా ఉంది. అయితే ఈ సమయాన్ని విదేశాల్లో ఎంజాయ్ చేయడానికి కేటాయించింది. అదేవిధంగా ఇప్పుడు ఈమె ఒక వెబ్ సిరీస్లో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. దీన్ని నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ రూపొందించనుందని తెలిసింది. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ను జపాన్లో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ప్రియాంక మోహన్