
అడ్డుగా ఉందని చిన్నారి హత్య
● రెండున్నరేళ్ల కుమార్తెకు మద్యం తాగించి హత్య ● తల్లి, ప్రియుడితో సహా నలుగురు అరెస్టు ● నెల్లైలో కలకలం
సేలం: నెల్లై జిల్లా దిసైయిన్విలై సమీపంలో సుఖానికి అడ్డుగా ఉందని రెండున్నర ఏళ్ల చిన్నారికి మద్యం తాగించి దారుణంగా హత్య చేసిన తల్లితోపాటు నలుగురిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వివరాలు.. నెల్లై జిల్లా దిసైయిన్విలై సమీపంలో ఉన్న మహాదేవన్కుళం ప్రాంతానికి చెందిన బృంద(27). ఈమె భర్త కోవైలో ఉన్న ఒక దుకాణంలో పని చేస్తున్నారు. వీరి కుమార్తె (రెండున్నర సంవత్సరాలు). బృందా మహాదేవకుళం ప్రాంతంలో ఉన్న అరటి తోటకు తన స్నేహితులతో వెళ్లింది. తర్వాత గురువారం సాత్తాన్కుళం సమీపంలో ఉన్న షణ్ముగపురంలో ఉన్న తన తల్లి ఇంటికి బృందా తన కుమార్తెతో వెళ్లింది. అక్కడ తన కుమార్తె మృతి చెందినట్టు బృందా భర్తకు తెలిపింది. తర్వాత చిన్నారిని దిసయిన్విలైలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పుడు చిన్నారి పెదాలు, శరీరంలో అక్కడక్కడ గాయాలు కనిపించడంతో సందేహించిన డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తర్వాత పోలీసులు అక్కడికి చేరుకుని ఆ చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం నెల్లై ప్రభుత్వ ఆస్పత్రికి తరించారు. అప్పుడు చిన్నారి తల్లి బృందా వద్ద పోలీసులు విచారణ జరిపారు. అప్పుడు బృందా రాత్రి ఒక మగ మిత్రుడితో ఉల్లాసంగా ఉన్న సమయంలో తన కుమార్తెను ఇతర పురుషుల వద్ద అప్పగించి వెళ్లినట్లు తెలిసింది. దీంతో గురువారం రాత్రి ఇట్టమొళి, తువరంపాడు ప్రాంతానికి చెందిన లింగసెల్వన్ (29), బెంజ్మెన్ (28), ముత్తుచూడర్ (28) అనే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. అందులో లింగసెల్వన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అరటి తోటలో వంతెన సమీపంలో ముత్తుచుడర్, బృందా ఉల్లాసంగా ఉన్నట్టు చిన్నారిని తన వద్ద అప్పగించి వెళ్లారని తెలిపాడు. రాత్రి పూట చిన్నారి అరుపులు విని ఎవరైనా వస్తారని పాప అరుపులు నిలపడం కోసం కొట్టి, తిట్టినా అరుపులు నిలపకపోవడంతో తాము తాగుతున్న మద్యంలో కొంత చిన్నారికి తాపించామని తెలిపాడు. అప్పుడు కొంత సేపటికే చిన్నారి శ్వాస ఆడక మృతి చెందినట్టు చెప్పాడు. వేకువజామున చిన్నారిని బృందా వద్ద అప్పగించి వెళ్లినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు లింగ సెల్వన్, ముత్తుచుడర్, బెంజిమెన్, బృందాలను అరెస్టు చేసి వారి వద్ద విచారణ జరుపుతున్నారు.