‘కులం’ పేర్లు తొలగించాల్సిందే!
● లేదంటే విద్యా సంస్థల గుర్తింపు రద్దు ● హైకోర్టు ఆదేశం
సాక్షి, చైన్నె: విద్యా సంస్థలకు ఉన్న కులం పేర్లు నాలుగు వారాలలోపు తొలగించాల్సిందేనని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. లేదంటే విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థలు అనేకం. సంఘాలు, కులాలు, మత పరమైన పేర్లతో ఉన్న విషయం తెలిసిందే. అలాగే ప్రభుత్వ పరంగా ఆది ద్రావిడ, గిరిజన, సిరుతిరుత్తం, కల్లర్ తదితర పేర్లతో ఉన్నాయి. అయితే, ఇటీవల కాలంగా రాష్ట్రంలో కులం పేరుతో విద్యా సంస్థలలో జరుగుతున్న వివాదాలను మద్రాసు హైకోర్టు పరిగణించింది. ఓ సంఘం రిజిస్ట్రేషన్ విషయంగా దాఖలైన పిటిషన్ విచారణ సమయంలో బుధవారం న్యాయమూర్తి భరత చక్రవర్తి కులం, సంఘాల పేర్ల విషయంగా తీవ్రంగా స్పందించారు. కులం, సంఘాల పేర్లతో బోర్డుల ఏర్పాటు ఏమిటో అని అసహనం వ్యక్తం చేశారు. కులం పేరిట సంఘాలను నమోదు చేయవద్దని రిజిస్ట్రేషన్ల విభాగం ఐజికి ఉత్తర్వులు జారీ చేశారు. కులం, సంఘం అంటూ పేర్లకు నిషేదం విధించే విధంగా ఓ చట్టం అవశ్యమని సూచించారు. కులం పేర్లతో ఉన్న విద్యా సంస్థలు తదితర వాటి బోర్డులనన్ని నాలుగు వారాలలోపు తొలగించాలని ఆదేశించారు. ఈ వ్యవహారాన్ని పూర్తిగా ముగింపు పలికే విధంగా మూడు నెలల నుంచి ఆరు నెలలలోపు కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేయాలన్నారు. కులం పేర్లతో చేతికి తాడు కట్టుకోవడం, కత్తులతో బడులకు రావడం వంటి ఘటనలు పెరుగుతుండడం వేదన కలిగిస్తున్నదన్నారు. విద్యా సంస్థలకు మంచి పేర్లను సూచించాలని హితవు పలికారు. ప్రభుత్వ పరిధిలోని ఆదిద్రావిడ, గిరిజన తదితర పాఠశాలల పేర్లను సైతం మార్చే దిశగా పలు సూచనలను న్యాయమూర్తి ఇచ్చారు.
గ్లోబల్ జాబితాలో చైన్నె వైద్యురాలికి చోటు
సాక్షి, చైన్నె: కంటిశుక్లం, వక్రీభవన శస్త్రచికిత్సలో ది ఆప్తాల్మాలజిస్ట్ పవర్ లిస్ట్ 2025 మేరకు టాప్ 10 గ్లోబల్ నిపుణులలో చైన్నెకు చెందిన డాక్టరు సూసన్ జాకబ్కు చోటు దక్కింది. బుధవారం ఈ వివరాలను స్థానికంగా ప్రకటించారు. ఆప్తాల్మాలజీలో శ్రేష్ఠత, అంకితభావం, ఆవిష్కరణలకు గాను ఈ గుర్తింపు దక్కింది. ఈ ప్రతిష్టాత్మక వార్షిక ర్యాంకింగ్ ప్రపంచంలోని నేత్ర వైద్యంలో అత్యంత స్ఫూర్తిదాయకమైన , ప్రభావవంతమైన 50 మంది గుర్తించి జాబితాను విడుదల చేయడం జరుగుతున్నది. ఇందులో చైన్నెలోని డాక్టర్ అగర్వాల్స్ గ్రూప్ ఆఫ్ ఐ హాస్పిటల్స్లో క్యాటరాక్ట్ ,గ్లాకోమా సర్వీసెస్కు సీనియర్ కన్సల్టెంట్, డాక్టర్ అగర్వాల్స్ రిఫ్రాక్టివ్ అండ్ కార్నియా ఫౌండేషన్ డైరెక్టర్ చీఫ్ డాక్టర్ సూసన్ జాకబ్ వరుసగా, 2021, 2022 మరియు 2024 పవర్ లిస్ట్లలో చోటు దక్కించుకున్నారు. తాజాగా ది ఆప్తాల్మాలజిస్ట్ పవర్ లిస్ట్ 2025లో సైతం స్థానం సంపాదించారు. 25 సంవత్సరాల వైద్య వృత్తిలో అనుభవం, వక్రీభవన శస్త్రచికిత్స, అత్యాధునిక కెరాటోకోనస్ నిర్వహణ, అధునాతన కార్నియల్ మార్పిడి, సంక్లిష్ట పూర్వ విభాగ పునర్నిర్మాణాలు, గ్లాకోమా, సంక్లిష్ట కంటిశుక్లాలలో ప్రత్యేకతకు గుర్తింపు దక్కినట్టు సూసన్ జాకబ్ పేర్కొన్నారు. కంటిశుక్లం, కంటిశుక్లం, గ్లాకోమా, కెరాటోకోనస్ రంగాలలో ఆప్తాల్మాలజీలో బహుళ ఆవిష్కరణలకు మరింత గౌరవం దక్కిందన్నారు.
జీతం వద్దు...గౌరవం చాలు!
●ఉన్నత స్థాయి కమిటీలో చోటుపై కురియన్ వ్యాఖ్య
సాక్షి, చైన్నె: తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి సాధించే దిశగా సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. స్వయం ప్రతిపత్తిపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేయడానికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ నేతృత్వంలో కమిటీని తమిళనాడు అసెంబ్లీ వేదికగా మంగళవారం ప్రకటించారు. ఈ కమిటీ విషయంగా జస్టిస్ కురియన్ జోసెఫ్ మాట్లాడినట్టుగా తమిళ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఈ కమిటీ ఏర్పాటుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సీఎం స్టాలిన్ ప్రయత్నాన్ని అభినందించారు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాల దిశగా అప్పటి సీఎం కరుణానిధి నియమించిన ఉన్నత కమిటీ గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రస్తుత సమయంలో అధ్యయనం ఎంతో అవసరం అని వ్యాఖ్యానించారు. న్యాయ, చట్టపరంగా పరిశోధనలు జరగాలని పేర్కొన్నారు. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా అనేక అంశాలతో స్పష్టత అవసరం అని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోగ్యకరమైన చర్యలను కమిటీ అన్ని విధాల అధ్యయనంతో తీసుకుంటుందన్నారు. ఈ కమిటీలో తనను నియమించిన సందర్భంగా సీఎం స్టాలిన్కు తాను ఒక్కటే చెప్పినట్టు వివరించారు. తనకు ఎలాంటి జీతం వద్దని, గౌరవ ప్రదంగా తన పనిని తాను నిర్వర్తిస్తానని వ్యాఖ్యానించారు.
‘కులం’ పేర్లు తొలగించాల్సిందే!


