నిబంధనలు తప్పక పాటించాలి
ఎక్కడి సమస్యలు అక్కడే..!
భానుపురి (సూర్యాపేట) : గ్రామ పంచాయతీల్లో నిధుల వినియోగంపై ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. దాంతో గ్రామాల్లో చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి, అత్యవసర పనులకు సమయానికి నిధులు అందని పరిస్థితి నెలకొంది. పంచాయతీలు సొంతంగా సమకూర్చుకునే నిధులను సైతం ఖర్చు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఏ చిన్న పని చేయాలన్న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే 16వ ఆర్థిక సంఘం నిధుల పైనే ఆధార పడాల్సి వస్తుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం కేవలం పారిశుద్ధ్య సిబ్బంది వేతనాలు చెల్లించి చేతులు దులుపుకుంటోంది. ఫలితంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు సైతం వీలులేకుండా పోతోందని సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాత పనులకే అధిక భాగం..
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 486 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటికి జనాభా ప్రాతిపదికన ఒక్కో గ్రామపంచాయతీకి రూ.10 లక్షల నుంచి 35 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తోంది. ఇందులో ఎక్కువ భాగం తాగునీరు, పారిశుద్ధ్య పనులకు మాత్రమే వీటిని వినియోగిస్తున్నారు. తరచూ పైప్ లైన్ల లీకేజీ, గేట్ వాల్స్ చెడిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతుండడంతో మరమ్మతులకు ఈ నిధులను ఖర్చు చేస్తున్నారు. బోరు మోటర్ల కొనుగోలు, వీధి దీపాల ఖర్చు గ్రామపంచాయతీలకు భారంగా మారుతోంది. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు వీటికే ఖర్చవుతుండడంతో మిగతా వసతుల కల్పనకు దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆంక్షలతో సమస్యలు..!
గ్రామపంచాయతీలు సొంతంగా సమకూర్చుకున్న నిధుల ఖర్చుపై ఆంక్షలు ప్రధాన సమస్యగా మారాయి. ఇంటి పన్నులు, ఇతర అనుమతుల కోసం ప్రజలు గ్రామపంచాయతీలకు చెల్లించే నిధులు అత్యవసర పనులకు వినియోగించుకునే విషయంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టం ద్వారా ఆంక్షలు విధించారు. ఈ నిధులను మొదట గ్రామపంచాయతీ అకౌంట్లో జమ చేసి తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నెలల తరబడి బిల్లులు చేతికి రాని పరిస్థితి ఉంది. దాంతో అత్యవసర పనులకు నిధులు లేక గ్రామపంచాయతీలు ఇబ్బందులు పడుతున్నాయి. గతంలో ఇలా సమకూరిన నిధులను అత్యవసర పనులకు ఖర్చు చేసి వాటికి బిల్లులు సమర్పిస్తే సరిపోయేది.
పంచాయతీరాజ్ చట్ట ప్రకారం గ్రామపంచాయతీలు వసూలు చేసే పన్నులు పంచాయతీ అకౌంట్లలో జమచేయాలి. నిబంధనల ప్రకారం పంచాయతీలు ఖర్చు చేసే నిధులకు బిల్లులు సమర్పించాలి. గతంలో జనరల్ నిధులపై ఫ్రీజింగ్ ఉండేది కాదు.
– యాదగిరి, డీపీఓ
పంచాయతీ ఖజానాకు ఆంక్షల తాళం
ఫ జనరల్ ఫండ్స్ ‘ఫ్రీజింగ్’తో
నిధుల సమస్య
ఫ కేవలం 16వ ఆర్థిక సంఘం
నిధులపైనే ఆధారం
ఫ అత్యవసర, చిన్న పనులకు నిధులు కరువు
జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు కొత్త పాలక వర్గాలు ఎన్నికై ఏడాది కావొస్తుంది. గతంలో ఉన్న పెండింగ్ నిధులను ప్రభుత్వం విడుదల చేయగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొద్ది మొత్తంలోనే గ్రామపంచాయతీలకు నిధులు అందాయి. కొత్తగా ఎన్నికై న సర్పంచ్లు ఇప్పటికే ఎన్నికల్లో ఖర్చు చేసి తిరిగి పంచాయతీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సొంతంగా ఖర్చు చేసేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. దాంతో పలు గ్రామపంచాయతీలో సమస్యలు పేరుకుపోయాయి.


