మునగాల : మాదిగ ఉద్యోగ సమాఖ్య(ఎంఈఎఫ్)జాతీయ కోర్కమిటీ వైస్ చైర్మన్గా మునగాల మండలంలోని విజయరాఘవపురం గ్రామానికి చెందిన డాక్టర్ కత్తి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు హైదరాబాద్లో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నట్లు వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు.
వీబీజీ రామ్జీ
పనుల పరిశీలన
నడిగూడెం : నడిగూడెం మండల పరిధిలోని బృందావనపురం, వేణుగోపాలపురం గ్రామాల్లో జరుగుతున్న వీబీజీ రామ్జీ పనులను మంగళవారం జెడ్పీ సీఈఓ డి.శిరీష ఆకస్మికంగా పరిశీలించారు. గ్రామాల్లో జరుగుతున్న పనులతో పాటు పండ్ల తోటలు, ఫామ్పాండ్ తదితర వాటిని ఆమె పరిశీలించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఆమె వెంట ఎంపీడీఓ ఎల్.మల్సూర్, ఎంపీఓ వీరాంజనేయులు, ఏపీఓ శ్రీనివాసరావు, ఈసీ శ్రీనివాస్, టీఏ అంజిరెడ్డి తదితరులు ఉన్నారు.
కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
భానుపురి (సూర్యాపేట): దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్పై బీఆర్ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు గానూ ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. మంగళవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు మొదటి నుంచి దళితులను అవమానించడం, మోసం చేయడం అలవాటేనని విమర్శించారు. ప్రజా సమస్యలను ప్రస్తావించని ప్రతిపక్ష నాయకుడు ఆ పదవిలో కొనసాగడం ఎందుకని ప్రశ్నించారు. స్పీకర్పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీవుల్లా, సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరన్న నాయక్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.
బుల్లెట్ ట్రైన్ సాధనే
లక్ష్యంగా ఉద్యమిద్దాం
సూర్యాపేట: బుల్లెట్ ట్రైన్ సూర్యాపేట మీదుగా వెళ్లే వరకు అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో ఉద్యమించాలని ప్రముఖ పారిశ్రామికవేత్త మీలా మహదేవ్, రైలు ఉద్యమ నేత మంచాల రంగయ్య పిలుపునిచ్చారు. బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నాటికి 26వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షల్లో పట్టణ ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. వారికి వీరు సంఘీభావం తెలిపి మాట్లాడారు. సూర్యాపేట రైల్వే సాధన సమితి చేపట్టిన ‘లక్ష పోస్ట్కార్డుల ఉద్యమానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పూర్వఅధ్యక్షుడు తీకుళ్ల సాయిరెడ్డి మద్దతు ప్రకటించారు.
వైభవంగా నారసింహుడి నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి ఆలయంలో శ్రీరాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని మంగళవారం అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. కల్యాణ తంతులో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, రుత్విగ్వరణం, పంచగవ్యప్రాశన, మధుపర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలను ఘనంగా జరిపారు. క్షేత్రపాలకుడైన శ్రీవీరాంజనేయస్వామికి నాగవల్లీ దళార్చన చేశారు.


