సూర్యాపేట టౌన్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం సరైనది కాదని బీఆర్ఎస్ మహిళా నాయకులు అన్నారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరును ఖండిస్తూ బీఆర్ఎస్ మహిళలు, నాయకులు జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద మంగళవారం భారీ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళా నాయకురాలు మాట్లాడుతూ.. నల్ల దుస్తులతో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు ప్రవర్తించిన తీరు సరికాదన్నారు. అసెంబ్లీ వద్ద పోలీసుల తోపులాటలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గాయపడడం ప్రభుత్వ దుర్మార్గ పాలనకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని, లేకుంటే భవిష్యత్లో తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, అంగిరేకుల నాగార్జున, వై.వి.గండూరి పావని కృపాకర్, కల్లెపల్లి మహేశ్వరి, సల్మా, గండూరి కృపాకర్, ఆకుల లవకుశ, రాజా తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఫిర్యాదు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ను వెంటనే అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ ఆధ్వర్యంలో మహిళలతో కలిసి పట్టణ సీఐకి ఫిర్యాదు చేశారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


