భానుపురి (సూర్యాపేట) : అర్హత కలిగిన ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించడమే ప్రధాన లక్ష్యమని ‘సర్’ జిల్లా పరిశీలకురాలు ఎ. దేవసేన తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆధ్వర్యంలో ‘ఎస్ఐఆర్’ కార్యక్రమంపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రధాన సమస్యలు గుర్తించలేదని తెలిపారు. అర్హత లేని వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడంతో పాటు, అర్హత కలిగిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు లభించేలా చూడటమే ఎస్ఐఆర్ ప్రధాన ఉద్దేశమని వివరించారు. వివాహిత మహిళల పేర్ల మార్పులు, పేర్లలోని అక్షర దోషాలను స్వీయ ప్రకటన ద్వారా సరిచేసుకునే అవకాశం ఉందన్నారు. మిగిలిన అంశాలకు సంబంధించి ఎన్నికల సంఘం సూచించిన ధ్రువపత్రాల్లో ఏదో ఒకదాన్ని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ.. మ్యాపింగ్ కాని వారు, అలాగే ఓటరు జాబితాలో చిరునామా, వయస్సు తదితర వివరాల్లో తేడాలున్న 1,94,106 మంది ఓటర్లను గుర్తించి వారికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి.హరి సింగ్, డీఆర్ఓ ప్రేమ్రాజ్, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ ఆర్డీఓలు వేణుమాధవ్ రావు, సూర్యనారాయణ, శ్రీనివాసులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
ఫ ‘సర్’ జిల్లా పరిశీలకురాలు దేవసేన


