అనంతగిరి : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామంలో ‘పల్లెల విధ్వంసం–పడకేసిన పారిశుధ్యం’ పేరుతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్య వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని, మురుగు, దోమలు, అపరిశుభ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణను ఉద్ధరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రస్తుతం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందన్నారు. సీఎం రేవంత్రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఆసరా పింఛన్ రూ.2 వేల నుంచి రూ.4 వేలకు, రైతు భరోసాను రూ.15 వేల చొప్పున ఇస్తామని ఇచ్చిన హామీలు నేటికీ అమలు కాలేదన్నారు. హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలే తగిన శాస్తి చేస్తారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నల్ల భూపాల్రెడ్డి, త్రిపురవరం సర్పంచ్ మాదాసు జ్యోతి, నాయకులు మామిడి నరసింహారావు, పాపిరెడ్డి, నవీన్రెడ్డి, సాయి, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్


