మూల్యాంకనంలో మార్పుపై..టీచర్ల ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

మూల్యాంకనంలో మార్పుపై..టీచర్ల ఆగ్రహం

Sep 4 2026 7:29 AM | Updated on Sep 4 2026 7:29 AM

కొత్త విధానం అసంబద్ధం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు టీచర్లను బోధనకు దూరం చేయడమే

త్వరలో అమలులోకి వస్తుంది

ఎస్‌ఏ– 1, ఎస్‌ఏ–2 పరీక్ష పత్రాలను ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో మూల్యాంకనం చేయించడం అసంబద్ధమైన అంశం. ఇది సీసీఈ నిబంధనలకు విరుద్ధం. దీనిని మేము వ్యతిరేకిస్తున్నాం. ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాలలో ఉంచుతూ స్వేచ్ఛగా పాఠ్యాంశాలు బోధించకుండా చేసే విధంగా ఉన్న కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. ఉపాధ్యాయులను బోధనకు పరిమితం చేసేలా చూడాలి.

–పుప్పాల వీరన్న,

టీపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

రాష్ట్రంలో విద్యారంగ సంస్కరణలపేరుతో అధికారులు కేవలం ప్రయోగాలకు పరిమితమైన విధానాలను రూపొందిస్తూ విద్యారంగాన్ని దిగజారుస్తున్నారు. అధికారుల ఏకపక్ష నిర్ణయం ఫలితంగా అసంబద్ధమైన నిర్ణయాలు చేస్తూ ఉత్తర్వులు ఇస్తున్నారు. బాహ్యమూల్యాంకనం కూడా ఇలాంటి నిర్ణయమే. విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి ఈ విధానంపై స్పష్టత ఇవ్వాలి. –సోంబాబు,

టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

సంస్కరణల పేరుతో డబ్బులు వృథా చేయడం, ఉపాధ్యాయులను బోధనకు దూరం చేయడం సరికాదు. తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని, జీఓ 25 సవరించాలని కొన్నేళ్లుగా ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నా పట్టించుకోని అధికారులు, స్వచ్ఛంద సంస్థలు చెప్పిన సలహాలు పాటిస్తూ విద్యారంగంలో ప్రయోగాలు చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి.

కోటమర్తి వీరయ్య,

టీఎస్‌ యూటీఎఫ్‌ నాయకుడు

బోధనకు విఘాతం

కలుగుతుందని ఆందోళన

ఎమ్మార్సీల్లోనే జవాబు పత్రాల

దిద్దాలంటున్న విద్యాశాఖ

సూర్యాపేటటౌన్‌ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పరీక్ష పత్రాల మూల్యాంకన విధానంలో పాఠశాల విద్యాశాఖ తెచ్చిన నూతన మార్పులు ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీశాయి. ఇప్పటివరకు సంబంధిత పాఠశాలల్లోనే జరుగుతున్న ఎస్‌ఏ–1, ఎస్‌ఏ–2 జవాబు పత్రాల దిద్దుబాటును ఇకపై మండల విద్యా వనరుల కేంద్రాల్లో (ఎమ్మార్సీ) నిర్వహించేలా శ్రీఎక్స్‌టర్నల్‌ ఎవాల్యుయేషన్‌ సిస్టమ్‌శ్రీను ప్రవేశపెట్టడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నిర్ణయం వల్ల టీచర్లపై తీవ్ర పనిభారం పడి నిత్య బోధనకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్షేత్రస్థాయి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

ఒకరి పేపర్లు మరొకరు..

గతంలో విద్యార్థులు రాసిన ఎస్‌ఏ–1, ఎస్‌ఏ–2 జవాబు పత్రాలను ఆయా పాఠశాలల్లోనే ఉపాధ్యాయులు దిద్దేవారు. కొత్త విధానం అమల్లోకి వస్తే ఈ పరిస్థితి ఉండదు. మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సంబంధించిన పరీక్ష పాత్రలను మండల కేంద్రంలోని ఎమ్మార్సీలకు చేరుస్తారు. అక్కడ ఒక పాఠశాలకు చెందిన పరీక్ష పత్రాలను వేరే పాఠశాల ఉపాధ్యాయులతో మూల్యాంకనం చేయించనున్నారు. విద్యార్థుల ప్రతిభను నిష్పక్షపాతంగా అంచనా వేయడం, మూల్యాంకనంలో పారదర్శకత తీసుకురావడం లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

అనేక అభ్యంతరాలు..

ఈ కొత్త విధానంపై కొన్ని ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జవాబు పత్రాలను ఎమ్మార్సీలకు తరలించడం, అక్కడ మూల్యాంకనం చేయడం వల్ల ఉపాధ్యాయులపై అదనపు భారం పడుతుందని పేర్కొంటున్నాయి. పాఠశాలల నుంచి ఎమ్మార్సీలకు జవాబు పత్రాల తరలింపు, భద్రత, మూల్యాంకనం అనంతరం వాటి నిర్వహణ వంటి అంశాలపై మరింత స్పష్టత అవసరమని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు.

జిల్లాలో 950 పాఠశాలలు

జిల్లాలో 950 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వాటిలో సుమారు 70 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి బోధన అందించేందుకు 4,118 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. కొత్త ఎక్స్‌టర్నల్‌ ఎవాల్యుయేషన్‌ విధానం ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి రానుంది. దాంతో కొత్త విధానం అమలు తీరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కొత్త ఎక్స్‌టర్నల్‌ ఎవాల్యుయేషన్‌ విధానం త్వరలోనే అమల్లోకి రానుంది. పాఠశాలల్లో నిర్వహించే ఎస్‌ఏ– 1, ఎస్‌ఏ– 2 పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనాన్ని ఎమ్మార్సీల్లో చేసేలా ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. నూతన విధానం ద్వారా పారదర్శకత పెరుగుతుంది. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టే అవకాశం ఉంటుంది.

– అశోక్‌, డీఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement