ఇల్లు మంజూరు చేయాలి
లబ్ధిదారులను ఎంపిక చేయాలి
అర్హులకు ఇళ్లు ఇవ్వాలి
తిరుమలగిరి (తుంగతుర్తి) : పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పట్టణ పేదలకు అందకుండా పోతోంది. జిల్లాలోని మిగతా మున్సిపాలీటీలతో పాటు అన్ని గ్రామాల్లో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయ్యాయి. గృహ ప్రవేశాలు కూడా జరిగాయి. కానీ తిరుమలగిరి మున్సిపాలిటీలో మాత్రం మొదటి విడత లబ్ధిదారుల జాబితా నేటికీ ప్రకటించలేదు. దాంతో పేదలు తమకు ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడిస్తారంటూ మున్సిపాలిటీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదు.
225 ఇళ్లు మంజూరు
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను 2025 జూన్ 2న ప్రారంభించింది. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. అటు తరువాత పలు గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు పనులు పూర్తి చేసుకొని గృహ ప్రవేశాలు కూడా చేశారు. తిరుమలగిరి మండలంలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై న ఖోక్యానాయక్ తండాలో 65 ఇళ్లు వివిధ గ్రామాలలో 195 ఇళ్లతో పాటు మున్సిపాలిటీలో 225 ఇళ్లు మంజూరయ్యాయి.
దరఖాస్తు చేసుకొని 14 నెలలు..
తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం సుమారు వెయ్యి మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు సమావేశమై ప్రతి వార్డులో లబ్ధిదారులను కూడా ఎంపిక చేశారు. ఈ ప్రక్రియ పూర్తయి 14 నెలలు గడిచినా నేటికీ మొదటి విడత అర్హుల జాబితాను వెల్లడించలేదు. లబ్ధిదారుల ఎంపిక విషయంలో స్థానిక నాయకుల మధ్య సమన్వయం లేక పోవడంతో ఆలస్యమవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో నిరుపేదలు తమకు ఇల్లు మంజూరవుతుందో లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో మొదటి విడుత ఇళ్లు పూర్తయి రెండవ విడత ఎంపిక కోసం గుడిసెల్లో ఉన్న పేదలను అధికారులు గుర్తించే పనిలో ఉన్నారు. కానీ మున్సిపాలిటీలో మాత్రం మొదటి విడత లబ్ధిదారులు ఎంపిక పూర్తికాకపోవడంపై పట్టణ పేదలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తిరుమలగిరిలో ఇందిరమ్మ ఇళ్లకు కలగని మోక్షం
నేటికీ వెలువడని మొదటి విడత జాబితా
మున్సిపల్ కార్యాలయం చుట్టూ
అర్హుల ప్రదక్షిణలు
మా ఇల్లు శిథిలావస్థకు చేరింది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుని సంవత్సరం దాటినా మంజూరు కాలేదు. అధికారులు స్పందించి ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి.
– గుగులోతు సత్తి, ఈదులపర్రె తండా
తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో చాలా మంది పేదలు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో లబ్ధిదారుల ఎంపిక చేనప్పటికీ ఇప్పటి వరకు జాబితా ప్రకటించ లేదు. అధికారులు స్పందించి అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేయాలి.
– కడెం లింగయ్య, తిరుమలగిరి
ఇతర ప్రాంతాల్లో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణం పూర్తయింది. రాజకీయ కారణాలతోనే తిరుమలగిరి మున్సిపాలిటీలో లబ్ధిదా రుల ఎంపిక జరగలేదు. అధికారులు విచారణ జరిపి అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలి. – ఎం.యాదగిరి, తిరుమలగిరి


