సూర్యాపేటటౌన్ : కాంగ్రెస్ పాలనలో రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యక్రమాలపై శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు కాలమో, ఎల్నినో ప్రభావమో కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కరువేనని ఆరోపించారు. రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. కృష్ణా, గోదావరి జలాలు ఎలా వృథాగా పోతున్నాయో బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించారన్నారు. 75 రోజుల్లో గోదావరి నుంచి 150 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేశారని ఆరోపించారు. కృష్ణా జలాల్లోనూ 150 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్కు తరలించారని విమర్శించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నీటితో నిండుతున్నా తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్గౌడ్, గోపగాని వెంకటనారాయణగౌడ్, అన్నపూర్ణ, అంగిరేకుల నాగార్జున, ఆ పార్టీ నియోజకవర్గ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
వెయ్యి రోజుల విఫల పాలనపై
నిరసనలు చేపడతాం
మాజీ మంత్రి, సూర్యాపేట
ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి


