నల్లగొండ టూటౌన్ : నిజామాబాద్లో సెప్టెంబర్ 4 నుంచి 7వ తేదీ వరకు జూనియర్ బాలికల రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ ఛాంపియన్షిప్ జరగనుంది. ఈ ఛాంపియన్షిప్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్టును ఎంపిక చేసేందుకు సెప్టెంబర్ 1న నల్లగొండ సమీపంలోని చర్లపల్లిలో గల విపస్యా స్కూల్లో పోటీలు నిర్వహించనున్నట్లు ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండారు ప్రసాద్, కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 01–01–2011 నుంచి 31–12–2012 మధ్య జన్మించిన బాలికలు అర్హులని వారు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఆధార్ కార్డు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 82470 45667, 94403 74027 నంబర్లను సంప్రదించాలన్నారు.
సీపీఎం పోరాట ఫలితంగానే రైతులకు భూ పట్టాలు
తుంగతుర్తి : సీపీఎం పోరాట ఫలితంగానే నేడు నూతనకల్లో రైతులకు ప్రభుత్వం భూమి హక్కులు కల్పిస్తూ పట్టాలు పంపిణీ చేసిందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. తుంగతుర్తిలో శనివారం జరిగిన ఆ పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎం అగ్ర నాయకులైన భీంరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, మల్లు వెంకటనరసింహారెడ్డి, తొట్ల మన్సూర్ లాంటి మహనీయులు ఎర్రపహాడ్ దొరల వద్ద ఉన్న భూములను పేదలకు పంచాలని ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఆ పోరాటాలకు ప్రజల మద్దతు కూడగొట్టుకొని అనేకసార్లు కలెక్టరేట్ వద్ద ధర్నాలు, తహసీల్దార్ కార్యాలయాల ముందు ఆందోళనలు చేశారన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాస్, కందాల శంకర్రెడ్డి, మండల కార్యదర్శులు వజ్జే శ్రీనివాస్, పోలోజు సైదులు, దేవరకొండ యాదగిరి, నాయకులు తాటి విజయమ్మ, సుదర్శన్, బూర్గుల ప్రభాకర్, గజ్జల శ్రీనివాస్రెడ్డి, కూసు సైదులు, గుడిపూడి వెంకటేశ్వర్లు, శివ, వెంకన్న, భాస్కర్, అవిలయ్య పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో
జోడు సేవోత్సవం
యాదగిరిగుట్ట: శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వెండి జోడు సేవ వైభవంగా నిర్వహించారు. శనివారం వేకువజామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చన పూజలను జరిపించారు. ఇక ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలను నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో ముందుగా శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం ఆలయ ఆచార వ్యవహారాలతో చేపట్టారు. సాయంత్రం వేళ భక్తుల నడుమ వెండి జోడు సేవలను మంగళ వాయిద్యాల మధ్య తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
బుద్ధవనాన్ని సందర్శించండి
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించాలని అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలోని బౌద్ధాచార్యులను బౌద్ధ పరిశోధకుడు, బుద్ధవనం నిర్మాణ సలహాదారుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి కోరారు. స్థానిక బౌద్ధాభిమాని రవికుమార్రెడ్డి లట్టుపల్లి సహకారంతో శనివారం ఫిలడెల్ఫియా నగరంలోని పలు బౌద్ధ విహారాలు, ఆలయాలను శివనాగిరెడ్డి సందర్శించి అక్కడి బౌద్ధాచార్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాగార్జునకొండ, బుద్ధవనం ప్రత్యేకతలతో పాటు తెలంగాణలోని ప్రసిద్ధ బౌద్ధారామాలు, బౌద్ధ వారసత్వ ప్రదేశాల విశిష్టతలను వారికి వివరించినట్లు శివనాగిరెడ్డి తెలిపారు. భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు బుద్ధవనాన్ని తప్పక సందర్శిస్తానని ఫిలడెల్ఫియా బౌద్ధాచార్యలు హామీ ఇచ్చినట్లు శివనాగిరెడ్డి పేర్కొన్నారు.


