● నూతనకల్లో పట్టాలు అందజేసిన
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
నూతనకల్, తిరుమలగిరి : రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం రెండున్నర సంవత్సరాలుగా పేదల పక్షంగా పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో నూతనకల్, మద్దిరాల మండలాల్లోని 15 గ్రామాలకు చెందిన 1921 మంది రైతులకు 2,091 ఎకరాల సీలింగ్ భూముల పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ రైతులను జైలుకు పంపిన గత ప్రభుత్వంలోని పెద్దలు నేడు కారుకూతలు కూస్తు ప్రజా ప్రభుత్వంపై విషాన్ని చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. వీరు తలకిందులుగా తపస్సు చేసినా మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనన్నారు.
ప్రభుత్వ విజయం : ఎమ్మెల్యే మందుల సామేల్
దశాబ్ధాల తరబడి పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలను పరిష్కరించి రైతులను భూమి హక్కులు కల్పిండం కాంగ్రెస్ ప్రభుత్వ విజయమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. భూమిపై హక్కులేని రైతులకు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పహాణీలపై బ్యాంకు రుణాలు అందించి సరైన గౌరవం ఇచ్చారని గుర్తు చేశారు. నేటి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించి వారి ఆత్మగౌరవాన్ని కాపాడారన్నారు. ఈ కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్, డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య, రెవెన్యూ సీసీఎల్ఏ సెక్రటరీ లోకేష్కుమార్, ల్యాండ్ సర్వీస్ సెటిల్మెంట్ కమీషనర్ రాజీవ్గాంధీ హన్మంతు షిండే, కలెక్టర్ తేజస్ నంద్లాల్పవార్, ఆర్డీఓ వేణుమాధవ్రావు, తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎల్సోజు చామంతినరేష్, తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మందుల సూర్యకిరణ్, జెన్నారెడ్డి వివేక్రెడ్డి, మందుల భాను, మండల పార్టీ అధ్యక్షులు కట్టా మల్లారెడ్డి, పచ్చిపాల వెంకన్న, గుడిపాటి సైదులు, పీఏసీఎస్ చైర్మన్ నాగం జయసుధసుధాకర్రెడ్డి, సుంకరి జనార్దన్, పాల్వాయి నాగరాజు, రేగటి రవిగౌడ్, మండల పార్టీల అధ్యక్షులు, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు.


