హుజూర్నగర్ : కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువతను ఎన్నికల్లో వాడుకొని వదిలేసిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్రెడ్డి విమర్శించారు. మంగళవారం హుజూ ర్నగర్లో యూత్ డిక్లరేషన్పై నిర్వహించిన నిరుద్యోగ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతే లక్ష్యంగా రాహుల్గాంధీ, ప్రియాంక, మల్లికార్జున ఖర్గేతో పాటు నాయకులు యూత్ డిక్లరేషన్ విడుదల చేసి అనేక హామీలిచ్చారన్నారు. దాంతో తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువత కోటి ఆశలతో ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. గద్దెనెక్కిన తరువాత వారి గురించి పట్టించుకోవడం వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో దాదాపు 13 సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయని, స్థానిక పరిశ్రమలలో 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించే జీఓ ఉన్నప్పటికీ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాల మీద దృష్టే లేదన్నారు. కేవలం మంత్రి పదవులపై ధ్యాసే తప్ప యువతను పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకుడు పిల్లుట్ల రఘు అధ్యక్షతన జరిగిన సదస్సులో బీఆర్ఎస్ నియోజకవర్గ, మండల నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో నిరుద్యోగ యువత, స్థానికులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ రాష్ట్ర
నాయకుడు రాకేష్రెడ్డి


