సూర్యాపేట అర్బన్ : పాలిటెక్నిక్ను శక్తి పథకానికి అనుసంధానం చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్ను కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టవద్దని, ప్రస్తుతం అమలులో ఉన్న ఎస్బీటీఈటీ విధానాన్ని కొనసాగించాలని, జీఓ 97ను రద్దు చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్కుమార్ డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ను శక్తిలో విలీనం చేయాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల నుంచి కల్నల్ సంతోష్ చౌరస్తా, ఎస్వీ కాలేజి వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అఖిల్కుమార్ మాట్లాడుతూ డిప్లోమా పూర్తిచేసిన అనంతరం బీటెక్లో చేరేందుకు ప్రస్తుతం ఉన్న విధానం ద్వారా ప్రవేశ పరీక్షలు, లాటరల్ ఎంట్రీ ద్వారా అవకాశం ఉందన్నారు. శక్తి పథకం అమలుతో ఈ అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జీఓ 97ను రద్దు చేసి, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రిషిత, సాహితి, హాసిని, రక్షణ, నవీన, గాయత్రి, సుహాని, సిరివెన్నెల, మనీషా, రుచిత, బ్లెస్సీ పాల్గొన్నారు.
తిరుమలగిరిలో రాస్తారోకో..
తిరుమలగిరి (తుంగతుర్తి) : పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి విభాగంలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ తిరుమలగిరిలో పీడీఎస్యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు పి.వైష్ణవ్, పోలబోయిన కిరణ్, జక్కుల సుధాకర్ వంశీ, నిఖిల్, సన్ని, రవితేజ, తనూష్, ఛత్రపతి, శ్రీనాథ్, అవినాష్, విష్ణు, చరణ్, గీత, రక్షిత పాల్గొన్నారు.
పాలిటెక్నిక్ను శక్తిలో విలీనంపై
విద్యార్థుల నిరసన


