సంవత్సరాల తరబడి ఇదే దందా..
కోదాడ: కోదాడ కేంద్రంగా వంట నూనె అక్రమ దందా సాగుతోంది. రెండు రోజుల క్రితం విజయవాడ– హైదరాబాద్ రోడ్డుపై ఆయిల్ ట్యాంకర్ నుంచి నూనె తీసి డబ్బాల్లో నింపి ఆటోల్లో తరలిస్తుండగా స్ధానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించడంతో ఈ వ్యవహారం బయటపడింది. ప్రస్తుతం ఆయిల్ ట్యాంకర్తో పాటు నూనెను తరలిస్తున్న ఆటో పోలీసుల అదుపులో ఉన్నాయి. వీటిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ట్యాంకర్ల సీల్ తీసి
20 లీటర్ల డబ్బాల ద్వారా తరలింపు
విజయవాడ నుంచి కోదాడ మీదుగా ప్రతిరోజు హైదరాబాద్కు వంటల్లో వాడే నూనెను ట్యాంకర్లలో తరలిస్తుంటారు. ఈ క్రమంలో కోదాడలోని ఓ నూనె డిపో వ్యాపారి ట్యాంకర్ల డ్రైవర్లతో కుమ్మకై ్క ప్రతిరోజు కోదాడ బైపాస్ వద్ద, సమీపంలోని వెంచర్లలో ఈ ట్యాంకర్లను నిలిపి వాటికి వేసిన సీల్ తీసి ఆయిల్ను 20 లీటర్ల డబ్బాల్లో నింపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆయిల్ను ఆటోల్లో డిపోకు తరలించి అక్కడ ఇతర నూనెలు కలిపి కల్తీ చేసి, వివిధ హోటళ్లు, రెస్టారెంట్లకు నేరుగా సరఫరా చేస్తున్నారని సమాచారం. మార్కెట్లో ధర ఉన్న సన్ప్లవర్, రైస్బ్రాన్, పామాయిల్ను ఇలా తక్కువ రేట్కు డ్రైవర్ల వద్ద కొనుగోలు చేసి ఇతర నూనెల్లో కలిపి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని పలువురు పేర్కొంటున్నారు.
కోదాడ కేంద్రంగా సంవత్సరాల తరబడి వంట నూనె అక్రమ దందా జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయిల్ డిపోల్లో లూజ్ ఆయిల్ అమ్మకూడదు. కానీ కోదాడలో మాత్రం లూజ్ ఆయిల్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. తూనికల కొలతల శాఖ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు గాని పట్టించుకున్న దాఖలాలు లేవని పట్టణవాసులు అంటున్నారు. పట్టణంలోని పలు హోటళ్లకు ఈ కల్తీ నూనెను సరఫరా చేస్తుండడంతో ప్రజల ఆరోగ్యాలు గాలిలో దీపంలా మారాయని పేర్కొంటున్నారు. ఈ కల్తీ దందాపై పూర్తిస్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఫ ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లతో
వంట నూనె డిపో వ్యాపారుల కుమ్మక్కు
ఫ ట్యాంకర్ల నుంచి ఆయిల్ తీసి
ఆటోల్లో డిపోకు తరలింపు
ఫ ఈ నూనెను నేరుగా హోటళ్లకు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు
ఫ ఇటీవల ఆయిల్ రవాణా చేస్తుండగా స్థానికులు పట్టుకోవడంతో బయటపడిన వ్యవహారం


