చిలుకూరు: మారుమూల గ్రామాల్లో పాఠశాలలు అందుబాటులో లేవు. ఇక్కడి విద్యార్థులు ఆటోలు, బస్సులు, సైకిళ్లపై ఇతర గ్రామాల్లో ఉన్న పాఠశాలలకు వెళ్తుంటారు. కొన్ని గ్రామాలకు కనీసం బస్సు సౌకర్యం కూడా ఉండదు. ఉన్న గ్రామంలో చదువుకొనే అవకాశం లేక, ఇతర ప్రాంతాల్లోని పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రవాణా భత్యం అందజేస్తోంది. ఇందుకుగాను ప్రభుత్వం రవాణా చార్జీల కింద ఈ ఏడాదికి సంబంధించి రూ.62.52 లక్షలు మంజూరు చేసింది.
జిల్లాలో 950 పాఠశాలలు
జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు 950 ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఒక కిలోమీటరు దూరం, 6 నుంచి 10వ తరగతికి సంబంధించి 3 కిలోమీటర్లు దూరంలో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. ఈ చొప్పున అందుబాటులో పాఠశాలలు లేని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలకు చెందిన మొత్తం 1042 మంది విద్యార్థులు ఉన్నట్లు విద్యాశాఖ తేల్చింది. వీరందరూ రవాణా చార్జీలు పొందేందుకు అర్హులుగా నిర్ణయించింది. వీరందరికీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ నుంచి ఒక్కక్కరికి నెలకు రూ.600 చొప్పున 10 నెలలకు రవాణా చార్జీలు మంజూరయ్యాయి. ఈ చొప్పున జిల్లావ్యాప్తంగా మొత్తం 1042 మంది విద్యార్థులకు రూ.62 లక్షల 52 వేలు విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.
ఫ 1,042 మందికి రూ.62.52 లక్షల
రవాణా చార్జీలు మంజూరు
ఫ ఒక్కో విద్యార్థి ఖాతాలో నెలకు రూ.600 చొప్పున 10 నెలలకుగాను నగదు జమ


