భానుపురి (సూర్యాపేట) : యాసంగి 2024–25, వానాకాలం 2025–26 సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ డెలివరీ సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్లో 2025–26 యాసంగి సీజన్కు సంబంధించి జిల్లాలోని రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025–26 యాసంగి సీజన్లో సుమారు 4,10,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అందుకు అనుగుణంగా మిల్లర్లు తమ రైస్ మిల్లులు, అవసరమైతే బయట ప్రదేశాల్లో కూడా ధాన్యం నిల్వ చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. బ్యాంక్ గ్యారంటీ, అగ్రిమెంట్, అవసరమైన ధాన్యం పరిమాణాన్ని లేఖ రూపంలో సమర్పించిన మిల్లర్లకే ధాన్యం కేటాయించబడుతుందన్నారు. ఈ సీజన్కు అవసరమైన గన్నీలను మిల్లర్లు రిపేర్ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు. గత సీజన్ సీఎంఆర్ డెలివరీ కొంతమేర పెండింగ్లో ఉన్నందున వాటిని వెంటనే పూర్తిచేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి మోహన్బాబు, జిల్లా మేనేజర్ రాము, సివిల్ సప్లయ్ శాఖ సిబ్బంది, 40 మంది రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి
సూర్యాపేట : అంగన్వాడీలు, ప్రీప్రైమరీ స్కూళ్లలో చిన్నారులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట మండలం రామన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రైమరీ పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదుల్లో జరుగుతున్న బోధన తీరు గమనించి, అభిరామ్, నాగశ్రీ, లాస్య, శివకుమార్, శృతి అనే విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. చిన్నారుల హాజరు, పౌష్టికాహార పంపిణీ, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. వంట గదిని పరిశీలించి, పిల్లలకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించి మాట్లాడారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య పనులను క్రమం తప్పకుండా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ యాదగిరి, తహసీల్దార్ కృష్ణయ్య, అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్


