
అసలేం జరిగింది..!
చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామ పరిధిలోని ఎస్ఆర్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అగ్ని ప్రమాదానికి ప్రాథమికంగా షార్ట్ సర్క్యూటే కారణమని చెప్పిన అధికారులు.. ఆదివారం మాత్రం రియాక్టర్ లీకై మంటలు వచ్చినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలోని ద్వారకామయి ప్రొడక్షన్ బ్లాక్లో వారం రోజుల క్రితం పాత రియాక్టర్ను తీసి దాని స్థానంలో కొత్తది బిగించినట్లు కార్మికులు చెబుతున్నారు. దీనితో పాటు మరో రియాక్టర్ మార్చాల్సి ఉండగా.. దానిని మార్చలేదు. మార్చని రియాక్టర్ నుంచే రసాయనాలు లీక్ కావడంతో మంటలు వచ్చినట్లు తెలుస్తోంది. మంటలు వచ్చిన సమయంలో ప్రొడక్షన్ ఇన్చార్జిగా ఉన్న మధుసూదన్చారి అక్కడ పనిచేస్తున్న ఆరుగురు కార్మికులను అప్రమత్తం చేయగా.. వారు బయటకు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. మంటల దాటికి రియాక్టర్లకు ఉన్న దూది కోటింగ్ కాలిపోయింది. ఓ రియాక్టర్ కిందపడిపోయింది. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో రియాక్టర్లు పేలలేదు. లేదంటే ప్రమాదం తీవ్రత భారీగా ఉండేది. ఆదివారం ఉదయం ప్రమాదం జరిగిన ప్రొడక్షన్ బ్లాక్ను ఉమ్మడి జిల్లా పరిశ్రమల ఇన్స్పెక్టర్ ఎస్. జంగయ్య సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. జరిగిన ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు ప్రొడక్షన్ ఇన్చార్జిగా ఉన్న మధుసూదన్చారిని ఫోన్లో సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
పూర్తిస్థాయి ఫైర్ సేఫ్టీ లేదు..
శనివారం రాత్రి ఎస్ఆర్ ల్యాబొరేటరీస్లో రియాక్టర్లోని రసాయనాలు లీకై చిన్నగా మంటలు వస్తున్నాయని సమాచారం రావడంతో చౌటుప్పల్ నుంచి అగ్నిమాపక సిబ్బంది వెళ్లి మంటలను అదుపు చేసినట్లు జిల్లా అగ్నిమాపక అధికారి మధుసూదన్రావు తెలిపారు. జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీ పూర్తిస్ధాయిలో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని గతంలోనే యాజమాన్యాలకు సూచించామని, కానీ ఎస్ఆర్ ల్యాబొరేటరీస్లో ఇంతవరకు పూర్తిస్థాయి ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకోలేదని ఆయన పేర్కొన్నారు. సరైన ఫైర్ సేఫ్టీ లేక ఫైరింజన్తో పాటు దివీస్ పరిశ్రమ నుంచి మంటలను అదుపుచేసే రసాయనాలను తీసుకొచ్చి త్వరగా మంటలను అదుపు చేయగల్గినట్లు ఆయన తెలిపారు.
ప్రమాదానికి కారణాన్ని
అంచనా వేయలేకపోతున్నాం..
ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలను ఇప్పటికిప్పుడే అంచనా వేయలేకపోతున్నామని పరిశ్రమల ఇన్స్పెక్టర్ ఎస్. జంగయ్య తెలిపారు. పరిశ్రమ అధికారులు మాత్రం షార్ట్ సర్క్యూట్ అని చెబుతున్నా.. అలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదని ఆయన అన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు నుంచి నివేదిక వచ్చిన తర్వాత నిర్ధారణకు వస్తామని పేర్కొన్నారు.
ఎస్ఆర్ ల్యాబొరేటరీస్లో జరిగిన
అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు
రియాక్టర్ లీకై ప్రమాదం జరిగిందని సమాచారం అందిందంటున్న
అగ్నిమాపక అధికారులు
షార్ట్ సర్క్యూటే కారణమంటున్న
కంపెనీ సిబ్బంది
మంటల వల్ల వెలువడిన రసాయనాలతో వాడిపోయిన పంట పొలాలు
ఎస్ఆర్ ల్యాబొరేటరీస్ను సందర్శించిన ఉమ్మడి జిల్లా పరిశ్రమల ఇన్స్పెక్టర్
పరిశ్రమలో పూర్తిస్థాయి ఫైర్ సేఫ్టీ
లేదంటున్న జిల్లా అగ్నిమాపక అధికారి
వాడిపోయిన పంట పొలాలు..
మంటల ధాటికి రియాక్టర్లలోని రసాయనాలు ఎగిసిపడడంతో పరిశ్రమ చుట్టుపక్కల గల జైకేసారం గ్రామానికి చెందిన పలువురు రైతులు వరి, జొన్న పంటలు వాడిపోయాయి. దీంతో పాటు రామన్నపేట వెళ్లే రోడ్డుపై కెమికల్ పడి విపరీతమైన దుర్వాసన వస్తోందని స్థానికులు చెబుతున్నారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని పంట నష్టపోయిన రైతులు పరిశ్రమ యాజమాన్యాన్ని కోరినట్లు సమాచారం.

అసలేం జరిగింది..!

అసలేం జరిగింది..!