అన్నీ ఆ 13,000 రూపాయల్లోనే! | average monthly income of lower middle class residents in Hyderabad is Rs 33000 | Sakshi
Sakshi News home page

అన్నీ ఆ 13,000 రూపాయల్లోనే!

Jun 22 2025 3:33 AM | Updated on Jun 22 2025 3:33 AM

average monthly income of lower middle class residents in Hyderabad is Rs 33000

దిగువ మధ్యతరగతి సగటు ఆదాయం రూ.33 వేలు 

వచ్చేదే అరకొర. పొదుపుగా వాడుకోవాలి. అందులోనే దాచుకోవాలి. అనుకోని ఖర్చులు ఎదురైతే ఎలా అని వెంటాడే ఆలోచనలు.. ఇదీ పైసా పైసా లెక్కబెట్టే ఓ సగటు దిగువ మధ్య తరగతి ‘జీవి’తం. దేశంలో దిగువ మధ్య తరగతికి చెందిన వ్యక్తుల సగటు ఆదాయం నెలకు రూ. 33,000. ఖర్చులు రూ. 20,000 వరకు ఉంటున్నాయి. మిగిలిన రూ.13 వేలల్లోనే వారి కలలు, ఆకాంక్షలు, నిర్ణయాలు అన్నీ ముడిపడి ఉంటున్నాయని ‘హోమ్‌ క్రెడిట్‌’ సంస్థ నివేదిక చెబుతోంది. గతేడాదితో పోలిస్తే ఆయా విభాగాల్లో నెలవారీ సగటు వ్యయాలూ పెరిగాయని వెల్లడించింది.

దేశవ్యాప్తంగా 1.8 కోట్ల మంది కస్టమర్లున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ‘హోమ్‌ క్రెడిట్‌ ఇండియా’ విడుదల చేసిన ‘ద గ్రేట్‌ ఇండియన్  వాలెట్‌–2025’ నివేదిక ప్రకారం నెలవారీ వ్యయాలు పోను తమ ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదు­పు చేస్తున్న వారు 50% మంది మాత్రమే. ఖర్చులతోనూ వెళ్లదీస్తూ, ఆదా చేయలేకపోతున్నవారు 38% మంది ఉన్నారు. 12% మంది నెలవారీ అవసరాల కోసం అప్పు చేస్తున్నారు. ప్రాంతాలు, తరాల వారీగా ఆదాయాల్లో వ్యత్యాసం, కొనుగోళ్ల తీరు వేరుగా ఉందని ఈ నివేదిక తెలిపింది.  

ఆదాయం రూ.5 లక్షలలోపు..
వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉన్న కుటుంబాల ఆదాయాలు, ఖర్చులు, పొదుపుల ఆధారంగా 17 నగరాలలోని 18–55 ఏళ్ల వయసున్న వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారంతో ఈ నివేదిక రూపొందించారు. వీరిలో పురుషులు 84%, స్త్రీలు 16% ఉన్నారు. జెన్ –జడ్‌ (13–28 ఏళ్లు) 19%, మిలీనియల్స్‌ (29–44 ఏళ్లు) 53, జెన్ –ఎక్స్‌ (44–59 ఏళ్లు) 28% ఉన్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో కార్మికులు 42 %, వ్యాపారులు 29, వేతన జీవులు 22, స్వయం ఉపాధి పొందుతున్నవారు 7% ఉన్నారు.

పొదుపులో జెన్ –జడ్‌
జెన్ –జడ్‌ తరంలో అత్యధికంగా 56% మంది పొదుపు చేస్తుండడం ఆసక్తి కలిగిస్తోంది. మిలీనియల్స్‌లో ఇది 53%. వీరితో పోలిస్తే జెన్ –ఎక్స్‌లో తక్కువగా 41% మంది మాత్రమే సేవింగ్స్‌కు మొగ్గు చూపుతున్నారు. వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన ఉన్నవారిలో జెన్ –జడ్‌ తరం నుంచి 33% ఉన్నారు. లక్ష్యాలను చేరుకోవడానికి ఆర్థిక మార్గదర్శకులు కావాలని 58% మంది భావిస్తున్నారు. జెన్ –జడ్‌ విషయంలో ఈ సంఖ్య 65%, మిలీనియల్స్‌లో 59% ఉన్నారు. ఇక భారత్‌లో దక్షిణాది రాష్ట్రాలు అత్యధిక సగటు ఆదాయం రూ.38,600 నమోదు చేయగా, ఉత్తరాది, తూర్పున ఇది సగటున రూ.30,300గా ఉంది. బెంగళూరు రూ.45,700తో తొలి స్థానంలో నిలిచింది.  రూ.39,200తో హైదరాబాద్, రూ.35,800 తో ముంబై ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఆకాంక్షలతోపాటు ఆందోళనలు..
వచ్చే అయిదేళ్లలో వ్యాపారం ప్రారంభించడం, విస్తరించాలని 23% మంది లక్ష్యంగా చేసుకున్నారు. ఇల్లు కొనుక్కోవాలని 23% ఆకాంక్షించారు. పిల్లల విద్యకు పొదుపు చేయాలని 15% మంది, రుణాల చెల్లింపు 11%, కారు కొనుగోలు 11%, విదేశీ టూర్‌ వెళ్లాలని 7% మంది భావిస్తున్నారు. దాదాపు 60% మంది తమ ఆర్థిక భవిష్యత్తు గురించి ఆందోళనగా ఉన్నారు. పిల్లల చదువులకు ఖర్చులు సరిపోవడం లేదని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే తగినంత పొదుపు లేదని, రుణాలు తిరిగి చెల్లించలేకపోతున్నామని, ఉద్యోగం లేదా ఆదాయ వనరు కోల్పోయామని, పదవీ విరమణకు సరిపడా డబ్బు లేవని ఆవేదన చెందుతున్నారు.

దుకాణాలకు వెళ్లి..
దుస్తులు, ఫ్యాషన్ , మొబైల్‌ ఫోన్ ్స, గృహోపకరణాలు, సరుకులు, మందులు.. ఈ విభాగాల్లో కస్టమర్లు ప్రత్యక్షంగా దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. మొత్తం కొనుగోళ్లలో ఏకంగా 83–85% ఆఫ్‌లైన్ లోనే నమోదు కావడం గమనార్హం. బస్సు, రైలు టికెట్‌ బుకింగ్స్, ఫుడ్‌ ఆర్డర్స్‌లో ఆఫ్‌లైన్  వాటా 58–59%గా ఉంది. రుణాల చెల్లింపుల్లో 50%, బిల్‌ పేమెంట్స్‌లో 54% ఆన్‌లైన్‌లోనే చేస్తున్నారు.

రూ.20వేల వరకు ఖర్చులకే సరిపోతోంది
పొదుపు చేయగలుగుతున్న వారు 50% మంది
⇒ భారీగా పెరిగిన పిల్లల చదువు వ్యయం
⇒ గతేడాదితో పోలిస్తే 34% పెరుగుదల
⇒ దుకాణాలకు వెళ్లి కొంటున్నారు
⇒ ‘ద గ్రేట్‌ ఇండియన్  వాలెట్‌–2025’ నివేదిక
⇒ కొనుగోళ్లలో సుమారు 85% ఆఫ్‌లైన్ లోనే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement