శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. అయితే రెవెన్యూ క్లినిక్ మాత్రం ఉండదని ఆయన ఆదివారం ఒక ప్రకటన జారీ చేశారు. నేటి నుంచి తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటనలో ఉన్నందున రెవెన్యూ క్లినిక్ నిర్వహించడం లేదని తెలిపారు. ఈ విషయాన్ని అర్జీదారులు గమనించి రెవెన్యూ సమస్యలపై పీజీఆర్ఎస్ కు రావద్దని ఆయన కోరారు. అర్జీదారులు వారి అర్జీలు నేరుగా పై కార్యక్రమంలో లేదా ఆన్లైన్లో మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్లో నమోదు చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.
రూ.3.15లక్షలకు
మహాలడ్డూ వేలం
శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలోని మొండేటివీధిలో లక్ష్మీగణపతి ఆలయంలో జరిగిన మహాలడ్డూ వేలంలో సన్సిల్వర్ పార్కు తిరుమలరాజు రూ.3,15,000లకు లడ్డూ దక్కించుకున్నారు. ముత్యాలహారం రూ.30వేలకు కొల్లి కృష్ణారావు దక్కించుకోగా, పగడాల హారం రూ.35వేలకు పొట్నూరు విఠల్, దినేష్, వేలంకిలు, మణిమాల హారం జామి సతీష్ రూ.70,001లకు దక్కించుకున్నారు.
రెవెన్యూ సర్వీసుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కిరణ్ కుమార్
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ సర్వీసుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా రణస్థలం తహసీల్దారు సనపల కిరణ్ కుమార్ నియమితులయ్యారు. ఆదివారం విజయవాడ పట్టణంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ సర్వీసుల సంఘం 18వ రాష్ట్ర ఎన్నికల్లో భాగంగా జరిగిన రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. శ్రీకాకుళం జిల్లా తరఫున రణస్థలం తహసీల్దార్ సనపల కిరణ్ కుమార్ రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రణస్థలం: వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ దేరసాం గ్రామంలో కప్పల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కప్పలకు పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించి, గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు పండాలని ప్రార్థించారు.
మాదకద్రవ్యాలతో జీవితం నాశనం
శ్రీకాకుళం క్రైమ్ : మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత శారీరకంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోవడంతో పాటు చెడు మార్గాల్లోకి వెళ్లే ప్రమాదముందని, వాటికి దూరంగా ఉండాలని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద అన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ‘నో డ్రగ్స్ – వికసిత్ భారత్’ కార్యక్రమానికి రూపొందించిన పోస్టర్ను ఆదివారం డీఎస్పీ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో జె.జోషి, జి.చిరంజీవి, కె.ప్రకాష్, పి.రాజు, ఎస్.రాజా తదితరులు పాల్గొన్నారు.


